క్రికెటర్లకు కరోనా కష్టాలు
By: Dimple Tue, 08 Sept 2020 09:57 AM
క్రికెటర్లను కోవిడ్ నిబంధనలు ముప్పు తిప్పలు పెడుతున్నాయి. మానసికంగా దెబ్బతీస్తున్నాయి. దుబాయిలో జరిగే ఐపీఎల్ మ్యాచులకు కరోనాకష్టాలు తరహాలోనే కరేబియన్ ప్రిమియర్ లీగ్, బిగ్ బ్యాష్, వంటి లీగులతోపాటు... అంతర్జాతీయ మ్యాచులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
కొవిడ్-19 ముప్పు నేపథ్యంలో క్రికెట్ టోర్నీలు నిర్వహించడం తలకు మించిన భారంగా మారుతోంది. ప్రభుత్వాల ఆంక్షలతో నిర్వహణ కష్టంగా అవుతోంది. ఐపీఎల్-2020 ముగిశాక టీమ్ఇండియా ఆస్ట్రేలియాలో పర్యటించాల్సి ఉంది. పెర్త్లో మొదట మ్యాచులు నిర్వహించాలని క్రికెట్ ఆస్ట్రేలియా భావించింది. కాగా క్వారంటైన్ నిబంధనల్లో సడలింపులు ఇవ్వలేమని వెస్ట్రన్ ఆస్ట్రేలియా ప్రభుత్వం స్పష్టం చేయడంతో బ్రిస్బేన్ లేదా అడిలైడ్కు వేదికలను మార్చనుందని తెలిసింది.
పెరుగుతున్న వైరస్ కేసులతో ఎంసీజీ అందుబాటులో లేకపోతే డే/నైట్, బాక్సింగ్ డే సహా అన్ని టెస్టులు అడిలైడ్లోనే నిర్వహించాలని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తోన్నట్టు తెలిసింది. ఐపీఎల్ తర్వాత భారత్, ఆసీస్ ఆటగాళ్లు నేరుగా ఆస్ట్రేలియా చేరుకుంటారు. పెర్త్లో మొదటి మ్యాచ్ నిర్వహించాక మిగతా వేదికల్లో మ్యాచులకు ఆతిథ్యం ఇవ్వాలన్నది సీఏ ప్రణాళిక.
పూర్తిగా క్వారంటైన్కే అంకితమవ్వడం బీసీసీఐకి ఇష్టం లేదు. క్వారంటైన్లో ఉంటూనే సాధన చేసుకొనేందుకు అవకాశం ఇవ్వాలని షరతు విధించింది. ఇందుకు వెస్ట్రన్ ఆస్ట్రేలియా ప్రభుత్వం అంగీకరించడం లేదు. సడలింపులు ఇవ్వలేమని, కట్టుదిట్టంగా క్వారంటైన్ ఆంక్షలను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో షెడ్యూలును సవరించి విడుదల చేయాలని సీఏ భావిస్తోంది.