తెలంగాణాలో 983 కొత్త కరోనా కేసులు ..అన్ని జిల్లాలకు పాకుతున్న వైరస్
By: Sankar Mon, 29 June 2020 09:25 AM
తెలంగాణాలో కరోనా ఉదృతి అంతకంతకు పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు ..వారం క్రితం వరకు ఎక్కువగా హైదరాబాద్ మరియు దాని చుట్టుపక్కల జిల్లాలు అయిన మేడ్చల్ , రంగారెడ్డి లలో ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి ..అయితే గత కొద్దీ రోజులగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కరోనా పాకడం మరింత ఆందోళన రేకెత్తిస్తుంది ..తాజాగా ఆదివారంను నాడు తెలంగాణాలో మొత్తం 983 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 14,419కి చేరింది. ఇందులో 9వేల మంది వివిధ ఆస్పత్రులు, హోంఐసోలేషన్లలో చికిత్స పొందుతుం డగా.. 5,172 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఆదివారం నలుగురు మృతి చెందగా.. ఇప్పటివరకు కరోనాతో చనిపోయినవారి సంఖ్య 247కి పెరిగింది.
కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 816 ఉండగా.. రంగారెడ్డిలో 47, మంచి ర్యాలలో 33, మేడ్చల్లో 29, వరంగల్ రూరల్లో 19, వరంగల్ అర్బన్లో 12, కొత్తగూడెంలో 5, కరీంనగర్, సిద్దిపేట, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో 3 చొప్పున, ఆదిలాబాద్, గద్వాల జిల్లాల్లో 2 చొప్పున, సంగారెడ్డి, మహబూబ్నగర్, జనగామ, మెదక్, సూర్యాపేట, నిజామాబాద్ జిల్లాల్లో ఒక్కో కేసు ఉన్నట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 3,227 మందికి పరీక్షలు నిర్వహించగా ఏకంగా 30% మందికి పాజిటివ్ రావడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు మొత్తం 82,458 మందికి పరీక్షలు నిర్వహించగా 17.48%మందికి పాజిటివ్ వచ్చింది.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఈనెల 24న అక్కడి ఐసోలేషన్ వార్డు నుంచి 47 మంది శాంపిల్స్ సేకరించి వరంగల్ ఎంజీఎంకు పంపించగా, ఆదివారం 31 మందికి పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారణ అయింది. వీరిలో బెల్లంపల్లి పట్టణానికి చెందినవారు 30 మంది ఉండగా, మందమర్రికి చెందిన ఓ వ్యక్తి ఉన్నారు. ఓ సింగరేణి కార్మికుడి నుంచి వారందరికీ వైరస్ సోకినట్లు వైద్యాధికారులు చెబుతున్నారు.ఇలా జిల్లాలకు కరోనా వ్యాపించడంతో అధికారులు ఆందోళనలో ఉన్నారు ఒక్కసారి పల్లెలకు పాకితే ఇక కరోనాను ఆపడం సాధ్యం అయ్యే పని కాదు అందుకే మళ్లీ హైదరాబాద్లో లాక్ డౌన్ విధించాలని ప్రజలు కోరుతున్నారు ..