నిమ్స్ లో కరోనా వాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం ..
By: Sankar Tue, 14 July 2020 5:03 PM
భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాక్సిన్ను మనుషులపై ప్రయోగించేందుకు ఇటీవల డీసీజీఐ అనుమతి మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోవాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కోసం దేశంలోని 12 కేంద్రాలను ఐసీఎంఆర్ ఎంపిక చేసింది. అందులో హైదరాబాద్లోని ప్రఖ్యాత నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) కూడా ఉంది. ఈ క్రమంలో నిమ్స్ అధికారులు క్లినికల్ ట్రయల్స్ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. తొలుత జూలై 7 నుంచి ట్రయల్స్ ప్రారంభిస్తామని ప్రకటించినప్పటికీ దానికి కాస్త బ్రేక్ పడింది.
తాజాగా మంగళవారం నిమ్స్లో కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ మొదలయ్యాయి. వాలంటీర్ల బ్లడ్ శాంపిల్స్ను సేకరించిన వైద్యులు వాటిని సెంట్రల్ ల్యాబ్కు పంపారు. కాగా, దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన చేసిన 12 కేంద్రాల్లో మొత్తం 375 మందిపై మొదటి డోస్ను పరీక్షించనున్నారు. నిమ్స్లో దాదాపు 60 మందిపై క్లినికల్ ట్రయల్స్ జరిపే అవకాశం ఉంది. మరోవైపు దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో.. వ్యాక్సిన్ను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని ఐసీఎంఆర్ భావిస్తోంది.
కాగా కరోనా వచ్చి దాదాపు ఏడు నెలలు అవుతున్న ఇంతవరకు ఏ దేశం కూడా కరోనా నివారణకు వాక్సిన్ తీసుకురాలేకపోయింది ..అమెరికా , రష్యా , చైనా ఇలా అనేక దేశాలు కరోనా వాక్సిన్ తయారీలో నిమగ్నం అయ్యాయి ..ఇటీవలే రష్యా కరోనా వాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కూడా పూర్తి అయినట్లు ప్రకటించిన విషయం తెల్సిందే ..