కంగనా రనౌత్ పై FIR నమోదు చేయాల్సిందిగా కోర్టు ఆదేశాలు
By: chandrasekar Sat, 10 Oct 2020 12:46 PM
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్
కంగనా రనౌత్ మొన్న ఢిల్లీ అల్లర్లు, నిన్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వ్యవహారంలో వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనం
రేపి౦ది. ఇప్పుడు ఇబ్బందుల్లో పడింది. నూతన వ్యవసాయ చట్టంపై నిరసనలు తెలుపుతున్న
వ్యవహారంలో ఆమె చేసిన వ్యాఖ్యలపై కోర్టు స్పందించింది. రైతుల మనోభావాల్ని
గాయపర్చేలా ట్వీట్లు చేసిందంటూ దాఖలైన పిటీషన్ పై కర్నాటకలోని తుంకూరు జ్యుడీషియల్
మెజిస్ట్రేట్ కోర్టు విచారణ చేపట్టింది. ఆమెపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాల్సిందిగా
పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 5 వతేదీన తీర్పును రిజర్వ్ లో పెట్టిన కోర్టు ఇప్పుడు
ఆదేశాలిచ్చింది. పౌరసత్వ సవరణ చట్టం ( సీఏఏ )
పై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసి అల్లర్లకు కారణమైనవాళ్లే ఇప్పుడు
రైతు బిల్లులపై కూడా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసి దేశంలో టెర్రర్
సృష్టిస్తున్నారు. వాళ్లు టెర్రరిస్టులు అంటూ కంగనా రనౌత్ ట్వీట్ చేసింది.
ఈ వ్యాఖ్యలు రైతుల
మనోభావాల్ని గాయపర్చేలా ఉన్నాయంటూ కోర్టులో పిటీషన్ దాఖలైంది. కంగనా చేసిన
ట్వీట్లు భిన్న భావజాలం కలిగిన రెండు గ్రూపుల మధ్య చిచ్చు రేపే అవకాశం ఉందని ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు
కూడా ఈ ట్వీట్లను చూసీ చూడనట్లే వదిలేసినట్లు కనిపిస్తోందని పిటీషన్ లో
పేర్కొన్నారు. ఇలాంటి కంటెంట్ను సోషల్ ప్లాట్ఫామ్స్లో పోస్టింగ్కి అనుమతిస్తే
ఈ దేశంలో రైతులకు తీరని నష్టం జరిగే అవకాశం ఉందనేది పిటీషనర్ వాదన. ఇలాంటి కంటెంట్ను
పోస్టు చేస్తున్నవారు దీన్ని ప్రోత్సహిస్తున్నవారు ఇద్దరూ కలిసి ఈ దేశానికి
వెన్నెముక అయిన రైతు ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని దేశంలో హింసను రెచ్చగొట్టి అస్థిరత
ఏర్పరిచేందుకు ప్రయత్నిస్తున్నారని రమేష్ నాయక్ అనే వ్యక్తి తన పిటీషన్లో
తెలిపారు. అలాంటివాళ్లపై సెక్షన్ 33,108,153,153A,504ల కింద కేసులు నమోదు చేయాలని కోరారు. రమేష్ నాయక్
పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం కంగనాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా
పోలీసుల్ని ఆదేశించారు. అయితే ఈ వ్యవహారంపై కంగనా రనౌత్ ఇంకా స్పందించలేదు.