Advertisement

  • ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ శ్రీనివాసరావుకు కోర్టు ధిక్కరణ...హైకోర్టు తీవ్ర ఆగ్రహం

ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ శ్రీనివాసరావుకు కోర్టు ధిక్కరణ...హైకోర్టు తీవ్ర ఆగ్రహం

By: chandrasekar Fri, 27 Nov 2020 4:18 PM

ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ శ్రీనివాసరావుకు కోర్టు ధిక్కరణ...హైకోర్టు తీవ్ర ఆగ్రహం


తెలంగాణలో కరోనా పరీక్షలు పెంచాలని ఆదేశాలిస్తే అమలు చేయకపోగా అవసరమైతే చేస్తామని ప్రభుత్వం నుంచి సమాధానం రావడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. కరోనా‌ పరీక్షలు, చికిత్స తదితర అంశాలపై దాఖలైన కొన్ని ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ జరిగింది. జిల్లా ఆస్పత్రులకు ఆర్టీపీసీఆర్‌ కిట్‌లు ఎన్ని సరఫరా చేశారు? ఎన్ని వాడారనే అంశాలను కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొనకపోవడంపై ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తంచేసింది. రాష్ట్ర ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ శ్రీనివాసరావుకు కోర్టు ధిక్కరణ నోటీసులు ఇచ్చింది. దీనిపై రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ధిక్కరణ కేసును ప్రత్యేకంగా విచారణ నిమిత్తం తమ ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ విచారణను డిసెంబరు 17వ తేదీకి వాయిదా వేసింది.

విచారణలో భాగంగా ధర్మాసనం స్పందిస్తూ పత్రికలు చూశారా? ఎన్నికల ప్రచారాల్లో ఒక్కరైనా సామాజిక దూరం పాటిస్తున్నారా? మాస్క్‌లు ధరిస్తున్నారా అని ప్రశ్నించింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా కరోనా రెండో దశ ఫలితాలు విడుదలయ్యేటట్లు ఉన్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘‘ప్రభుత్వం నిద్రపోతోంది. కరోనా రెండో దశ ముప్పును ఎదుర్కోవడానికి ఎలాంటి ప్రణాళిక రూపొందించలేదు. రోజుకు 50 వేల పరీక్షలు చేయాలని ఆదేశించినా ఈ నెల 19 నుంచి 25 వరకూ గరిష్ఠంగా 47 వేల పరీక్షలే చేశారు. ఇక లక్ష పరీక్షలు ఎప్పుడు చేస్తారు’’ అని ప్రశ్నించింది. నివేదికలో ‘ఎప్పుడు అవసరమైతే అప్పుడు’ అని రాసినందుకు క్షమాపణ కోరుతున్నట్లు ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా హైకోర్టు మరికొన్ని ఆదేశాలిచ్చింది. ‘‘రోజుకు 50 వేలు, వారంలో ఒక రోజు లక్ష పరీక్షలు నిర్వహించాలి. సంచార పరీక్ష కేంద్రాలను పెంచాలి. ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షలకు 6 ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలి. కొవిడ్‌ బాధితులకు కౌన్సెలింగ్‌ ఇవ్వడానికి మానసిక వైద్య కేంద్రం ఏర్పాటును పరిశీలించాలి. ప్రజలు కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకునే బాధ్యత పోలీసులకు అప్పగించాలి. ఈ నెల 25న కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలి. సుప్రీంకోర్టు గత ఆదేశాల మేరకు కొవిడ్‌ ఆస్పత్రుల నిర్వహణపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలి.’’ అని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది.

Tags :

Advertisement