తెలంగాణాలో కరోనా నిర్ధారణకు ప్రైవేట్ ల్యాబుల్లో పరీక్షలకు అనుమతి
By: chandrasekar Mon, 15 June 2020 3:51 PM
తెలంగాణాలో కరోనా
నిర్ధారణకు వారం రోజుల్లో 50 వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించాలని అధికారులను
ఆదేశించారు. ప్రైవేట్ ల్యాబుల్లో పరీక్షలకు అనుమతించారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో
చికిత్సకు అనమతించారు. కరోనా వైరస్ పరీక్షలు, చికిత్స విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం
తీసుకున్నారు. ప్రైవేట్ ల్యాబొరేటరీలు, ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాధి నిర్ధారక పరీక్షలు, చికిత్స
చేయించుకోవడానికి అవకాశం కల్పించాలని నిర్ణయించారు. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలు, ధరలు
నిర్ణయించాలని అధికారులను ఆదేశించారు. వారం రోజుల్లోగా 50 వేల
మందికి పరీక్షలు నిర్వహించాలని నిర్దేశించారు. పాజిటివ్గా తేలినప్పటికీ కొవిడ్
లక్షణాలు తీవ్రంగా లేనివారికి ఇంట్లోనే ఉంచి చికిత్స అందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. హైదరాబాద్ దాని పరిసర
ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టుదిట్టంగా నియంత్రించాలని నిర్ణయించినట్లు
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. రాబోయే వారం, పది రోజుల్లో హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, సంగారెడ్డి
జిల్లాలకు చెందిన 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 50 వేల
మందికి ముందు జాగ్రత్త చర్యగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని
అధికారులను ఆదేశించారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై ఆదివారం జూన్ 14 ఆయన
ప్రగతిభవన్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే
తెలంగాణలో వైరస్ వ్యాప్తి తక్కువగానే ఉందని అధికారులు వివరించారు. మరణాల రేటు
తక్కువగాను, కోలుకుంటున్నవారి సంఖ్య చాలా ఎక్కువగాను నమోదవుతోందని
చెప్పారు. అయితే, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్
జిల్లాల్లో పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని వివరించారు. ఆ తర్వాత
స్థానంలో సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలున్నాయని తెలిపారు. హైదరాబాద్, దాని
చుట్టుపక్కల ఉన్న ఇతర నాలుగు జిల్లాలపై మరింత ఎక్కువ దృష్టి పెట్టాలని, ఈ ఐదు
జిల్లాల పరిధిలోని 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో యుద్ధ ప్రాతిపదికన
చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. హైదరాబాద్ ను కాపాడుకోవాలనే ముందు
చూపుతో మాత్రమే 50 వేల మందికి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించాం.
ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎవరికి వారు వ్యక్తిగత జాగ్రత్తలు
పాటించాలి. ముఖ్యంగా వృద్ధులు ఇంట్లోనే ఉండాలి. ఇతర తీవ్ర జబ్బులు ఉన్నవారు కూడా
జాగ్రత్తగా ఉండటం అవసరం.
రాష్ట్రంలో ఎంత మందికి
పాజిటివ్ వచ్చినా చికిత్స అందించడానికి ప్రభుత్వం సర్వ సిద్ధంగా ఉంది. టెస్టు
కిట్లు, పీపీఈ
కిట్లు, ఎన్-95
మాస్కులు, బెడ్లు, ఐసీయూ
బెడ్లు, వెంటిలేటర్లు
అన్ని అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని
కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తిని నివారించడానికి యుద్ధ
ప్రాతిపదికన చర్యలు తీసుకోవడంతోపాటు, వైరస్ సోకినవారికి అవసరమైన చికిత్స అందించే విషయంలో
ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో, అప్రమత్తతతో ఉందని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటిది. ఎక్కువ జనాభా కలిగిన నగరం.
దేశంలోని మెట్రోపాలిటన్ నగరాల్లో హైదరాబాద్ ఒకటి. హైదరాబాద్ ప్రజల ఆరోగ్యం, నగర
ప్రగతి, నగర
పేరు ప్రఖ్యాతులు సుస్థిరంగా ఉండేట్లు చూడాల్సిన బాధ్యత మనపై ఉంది. రాష్ట్రంలో
కరోనా వైరస్ వ్యాప్తి తక్కువగానే ఉన్నప్పటికీ, హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతిరోజూ ఎన్నోకొన్ని
పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీన్ని పూర్తి స్థాయిలో నివారించాల్సిన అవసరం
ఉంది అని కేసీఆర్ సూచించారు.
వైరస్ వ్యాప్తి జరగకుండా
ముందు జాగ్రత్త చర్యగా హైదరాబాద్, చుట్టుపక్కల జిల్లాల్లోని ఉప్పల్, ఎల్.బి.నగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, శేర్లింగంపల్లి, చేవెళ్ల, పరిగి, వికారాబాద్, తాండూర్, మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, మలక్పేట్, అంబర్ పేట్, ముషీరాబాద్, ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, సనత్ నగర్, నాంపల్లి, కార్వాన్, గోషా మహల్, చార్మినార్, చాంద్రాయణ గుట్ట, యాకుత్ పుర, బహదూర్పుర, సికింద్రాబాద్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, పటాన్చెరు
అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 50 వేల మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని
కేసీఆర్ ఆదేశించారు. ఇందుకోసం ప్రభుత్వ ఆస్పత్రులనే కాకుండా, ప్రైవేట్
లాబరేటరీలు, ఆస్పత్రులను కూడా వినియోగించుకోవాలని సూచించారు.
వైద్య, ఆరోగ్యశాఖ
మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎంఓ
ముఖ్యకార్యదర్శి నర్సింగ్ రావు, కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, సీనియర్
వైద్యాధికారులు, వైద్య నిపుణులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.