భారత్ లో 198 రూపాల్లో కరోనా ..
By: Sankar Wed, 03 June 2020 9:17 PM
కరోనా వైరస్ అంతకంతకూ తన రూపం మార్చుకుంటోంది. జన్యుక్రమాన్ని క్రమంగా అభివృద్ధి చేసుకుంటోంది. భారత్లో వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్.. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 198 రకాలుగా రూపాంతరం చెందినట్లు పరిశోధకులు గుర్తించారు. ఢిల్లీ, గుజరాత్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో వైరస్ ఎక్కువగా రూపాంతరం చెందినట్లు గుర్తించామని వారు తెలిపారు. ఈ 198 రకాల కరోనా వైరస్కు మూలం మాత్రం చైనా, యూరప్లో వ్యాప్తిలో ఉన్న కరోనా వైరసేనని స్పష్టం చేశారు. వుహాన్లో తొలి దశలో వ్యాప్తి చెందిన వైరస్తో పోలిస్తే ఇది మరింత ప్రమాదకరమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
దేశంలో వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్పై జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జెడ్ఎస్ఐ)కు చెందిన పరిశోధకులు రెండు నెలలుగా పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 400 జీనోమ్స్పై పరిశోధనలు జరుపగా వాటిలో 198 వేర్వేరు కరోనా వైరస్ రకాలను గుర్తించారు. కరోనా వైరస్ భారత్లో ప్రవేశించే ముందు 198 సార్లు రూపాంతరం చెందిందని జెడ్ఎస్ఐ కోల్కతా విభాగం డైరెక్టర్ కైలాశ్ చంద్ర తెలిపారు. జెడ్ఎస్ఐలోని ఏడుగురు శాస్త్రవేత్తలు, పలువురు స్కాలర్స్ దీనిపై పరిశోధనలు జరిపినట్లు ఆయన తెలిపారు.
అంతర్జాతీయ డేటా ఆధారంగా మార్చి మొదటి వారం, మే చివరి వారంలో వివిధ జీనోమ్స్ను విశ్లేషించినట్లు పరిశోధకులు తెలిపారు. వీటిలో ఢిల్లీలో 39, అహ్మదాబాద్ 60, గాంధీనగర్లో 13, తెలంగాణలో 55, మహారాష్ట్రలో 15, కర్ణాటకలో 15 వైరస్ రకాలను గుర్తించినట్లు తెలిపారు. అయితే వీటి మూలం మాత్రం చైనా, యూరప్లేనని పేర్కొన్నారు.