Advertisement

  • కరోనా వైరస్: అంతర్గత రికార్డింగులు బయటపడటంతో మరోమారు చర్చనీయాంశంగా మారిన డబ్ల్యూహెచ్‌వో వ్యవహారశైలి...

కరోనా వైరస్: అంతర్గత రికార్డింగులు బయటపడటంతో మరోమారు చర్చనీయాంశంగా మారిన డబ్ల్యూహెచ్‌వో వ్యవహారశైలి...

By: chandrasekar Thu, 12 Nov 2020 11:14 AM

కరోనా వైరస్: అంతర్గత రికార్డింగులు బయటపడటంతో మరోమారు చర్చనీయాంశంగా మారిన డబ్ల్యూహెచ్‌వో వ్యవహారశైలి...


కరోనా వైరస్ విషయంలో డబ్ల్యూహెచ్‌వో వ్యవహారశైలిపై పలు అనుమానాలు, విమర్శలు వ్యక్తమయిన అయ్యాయి. డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధ్నోమ్ చైనాకు అనుకూలంగా వ్యవహరించారని, మహమ్మారి గురించి ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయడంలో విఫలమయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. తాజాగా, డబ్ల్యూహెచ్ఓ అంతర్గత సమావేశాలకు సంబంధించిన రికార్డింగులు బయటపడటంతో వీటికి మరింత బలం చేకూరినట్టయ్యింది. కరోనా వైరస్ విజృంభించిన తొలినాళ్లలో ఆ సంస్థ ప్రతినిధులు బహిరంగంగా చేసిన వ్యాఖ్యలకు, అంతర్గత సమావేశాల్లో నిపుణులు, శాస్త్రవేత్తలు వ్యక్తం చేసిన అభిప్రాయాలకూ సంబంధం లేదని వీటి ద్వారా వ్యక్తమవుతోంది.

ఈ రికార్డింగులు బయటపడటంతో డబ్ల్యూహెచ్‌వో వ్యవహారశైలి మరోమారు చర్చనీయాంశంగా మారింది. ప్రపంచ ప్రజల ఆరోగ్య విషయంలో కీలక పాత్ర పోషించే డబ్ల్యూహెచ్‌వో ఇచ్చే మార్గదర్శకాలే ప్రామాణికం. అయితే మహమ్మారి విషయంలో దీని వ్యవహారశైలి పలు విమర్శలకు తావిచ్చింది. పెద్ద మొత్తంలో నిధులిచ్చే సభ్య దేశాలను చూసీచూడనట్టు వ్యవహరించి, కఠినంగా వ్యవహరించలేదన్న విమర్శలను ఎదుర్కొంటోంది. కరోనా వైరస్ రెండో సారి విజృంభించడంతో అంతర్గత సమావేశాలకు సంబంధించిన రికార్డింగులు, పత్రాలు అసోసియేట్ ప్రెస్‌కు చిక్కాయి. జనవరి నుంచి ఏప్రిల్ మధ్య జరిగిన వివిధ సమావేశాలకు సంబంధించిన రికార్డుంగులు ఇందులో ఉన్నాయి. వైరస్‌ కట్టడికి ప్రపంచ దేశాలు చేస్తున్న కృషిని అప్పట్లో ఈ సంస్థ అభినందించింది. అయితే... ‘వైరస్‌పై అధ్యయనం చేయడం ఆ ప్రయోగశాల దురదృష్టం’ అంటూ డబ్ల్యూహెచ్‌వోకు చెందిన అత్యున్నత నిపుణులు, శాస్త్రవేత్తలు అంతర్గత సమావేశాల్లో వ్యాఖ్యానించినట్టు ఆ రికార్డింగుల్లో ఉన్నాయి. దీంతో కరోనాకు మూల కేంద్రమైన చైనాలోని వుహాన్‌ ల్యాబ్‌ గురించే వారు మాట్లాడినట్టు తెలుస్తోంది.

అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, జపాన్ వంటి దేశాల్లో వైరస్‌ ప్రబలంగా ఉండగా.. డబ్ల్యూహెచ్‌వోకు వీటి నుంచి భారీగా నిధులు అందుతాయి. మహమ్మారి విషయంలో ఆ దేశాలు ఎన్ని తప్పులు చేసినా, డబ్ల్యూహెచ్‌వో ఉదాసీన వైఖరిని ప్రదర్శించి, చర్యలూ తీసుకోలేదు. తత్ఫలితంగా ప్రపంచ దేశాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. వాటిపై కఠిన చర్యలు తీసుకుని ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని సంస్థ నిపుణులు అభిప్రాయపడినట్టు రికార్డింగులు, పత్రాల ద్వారా తెలుస్తోంది.

చైనాకు డబ్ల్యూహెచ్‌వో అనుకూలంగా వ్యవహరిస్తోందని బాహటంగా విమర్శలు గుప్పించి, పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఆ సంస్థకు నిధులు నిలిపేశారు. దీంతో ఆ సంస్థ ఆర్థికంగా నష్టపోయి, తీవ్ర ఒత్తిడికి గురైంది. అయితే, ఈ చర్యలను కొత్తగా ఎన్నికయిన అధ్యక్షుడు జో బైడెన్ విమర్శించారు. తాము ఎన్నికల్లో విజయం సాధిస్తే డబ్ల్యూహెచ్‌వోకు అందాల్సిన నిధులను విడుదల చేస్తామనీ, కోతలను ఎత్తివేస్తామని బైడెన్‌ హామీ ఇచ్చారు. ప్రస్తుతం బైడెన్ అధ్యక్షుడు కాబోతుండటంతో డబ్ల్యూహెచ్‌వో మళ్లీ అమెరికా వైపు ఆశగా చూస్తోంది. కానీ, రికార్డింగుల వ్యవహారం డబ్ల్యూహెచ్‌వోకు ఇబ్బందిగా మారింది. ఇలాంటి తరుణంలో బైడెన్‌ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో? అన్నది వేచి చూడాల్సిందే. డబ్ల్యూహెచ్ఓ ధైర్యంగా ముందుకెళ్లి, రాజకీయ శక్తి ఉపయోగించాల్సిన అవసరం ఉందని ఎందుకంటే పరిణామాలు చాలా వినాశకరమైనవని క్వీన్ మేరీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ సోఫియా హర్మన్ అన్నారు. ఒకవేళ సభ్య దేశాలపై టెడ్రోస్ కఠిన చర్యలు తీసుకుని ఉంటే, దాని పర్యవసానాలు వేరేలా ఉంటాయని జెనీవా గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ గ్లోబల్ హెల్త్ సెంటర్ కో-డైరెక్టర్ సురై మూన్ అన్నారు.

Tags :

Advertisement