అవసరమైన వారికీ మాత్రమే కరోనా వ్యాక్సిన్ ఇస్తే సరిపోతుంది...కేంద్రం
By: Sankar Wed, 02 Dec 2020 05:48 AM
కరోనాను కట్టడి చేసేందుకు దేశంలోని అందరికీ వ్యాక్సినేషన్ చేయాల్సిన అవసరం లేదని, అవసరమైనంత మందికి వ్యాక్సిన్ ఇస్తే సరిపోతుందని కేంద్రం స్పష్టం చేసింది.
వ్యాక్సిన్ ప్రధాన లక్ష్యం వైరస్ చైన్ను తెగ్గొట్టడమేనని, దాన్ని సాధించేందుకు దేశంలోని అందరికీ వ్యాక్సినేషన్ చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ప్రతీఒక్కరికీ వ్యాక్సిన్ ఇస్తామని తాము ఎప్పుడూ చెప్పలేదని పేర్కొంది. వ్యాక్సినేషన్ చేసేందుకు దేశంలో కొందరిని జాబితా నుంచి తొలగించారని వదంతులు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవతో కలసి మీడియాతో మాట్లాడారు.
అవసరమైనంత మందికి వ్యాక్సిన్ ఇచ్చాక.. ఇక అందరికీ వ్యాక్సినేషన్ చేయాల్సిన అవసరం ఉండబోదని స్పష్టం చేశారు. ఇలాంటి సాంకేతికపరమైన అంశాల్లో వాస్తవాలను ఆధారంగా చేసుకొని చర్చలు జరగాల్సి ఉంటుందన్నారు. జనాభాలో కొద్ది మందికే టీకా ప్రారంభిస్తామని, అందుకే కరోనా నుంచి రక్షించుకోవడానికి మాస్క్ లను కవచంగా వాడాలని బలరాం భార్గవ అన్నారు.