సెప్టెంబర్ వరకు దేశంలో కరోనా వాక్సిన్
By: Sankar Tue, 09 June 2020 5:26 PM
ప్రపంచ దేశాలను కలవరానికి గురిచేస్తున్న కరోనా వైరస్కు అతి త్వరలోనే వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంది. దేశంలో మరో 3 నెలల్లో వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ‘ఆస్ట్రాజెనెకా’ ప్రకటించింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్కు తయారీ, మార్కెటింగ్లో ఈ ఫార్మా సంస్థ అధికారిక భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ‘ఏజెడ్డీ 1222 జేఏబీ’ అనే వ్యాక్సిన్ తయారీని ప్రారంభించామని, ఆగస్టు నాటికి అన్ని పరీక్షలు పూర్తి చేసి మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపింది. వ్యాక్సిన్పై పరిశోధన ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని వెల్లడించింది.
భారత్లో సెప్టెంబర్ నాటికి 10 కోట్ల డోసుల వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొస్తామని ఆస్ట్రాజెనెకా సంస్థ చెబుతోంది. ఈ సంస్థ నాలుగు దేశాల్లో ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ను ఉత్పత్తి చేయనుంది. బ్రిటన్తో పాటు భారత్, నార్వే, స్విట్జర్లాండ్ దేశాల్లో వ్యాక్సిన్ తయారీని ప్రారంభించనుంది. ఇందుకోసం బ్రిటన్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. మన దేశంలో ఈ వ్యాక్సిన్ తయారు చేసేందుకు ‘సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా’తో ఒప్పందం చేసుకుంది.
గత డిసెంబర్లో చైనాలోని వుహాన్లో పుట్టి ప్రపంచ దేశాలన్నింటికీ పాకిన కరోనా మహమ్మారికి విరుగుడు వ్యాక్సిన్ కోసం వివిధ దేశాల్లో 100కు పైగా పరిశోధనలు జరుగుతున్న విషయం తెలిసిందే. వీటిలో 12 సంస్థల పరిశోధనలను డబ్ల్యూహెచ్వో గుర్తించింది. డబ్ల్యూహెచ్వో గుర్తింపు పొందిన వాటిలో ఆక్స్ఫర్డ్ వర్సిటీ ఒకటి. ఏజెడ్డీ 1222 జేఏబీ అనే వ్యాక్సిన్పై పరిశోధనలు చేస్తున్న ఆక్స్ఫర్డ్ వర్సిటీ.. ఇప్పటికే కోతులపై ప్రయోగాలు పూర్తి చేసుకొని మనుషులపై రెండో దశ ప్రయోగాలు చేస్తోంది.
india