కరోనా వ్యాక్సిన్ పై కీలక వ్యాఖ్యలు చేసిన కేంద్ర ఆరోగ్య మంత్రి
By: Sankar Mon, 14 Sept 2020 07:21 AM
ప్రపంచ వ్యాప్తంగా కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంది..ముఖ్యంగా ఇండియాలో రోజు రోజుకు కరోనా కేసులు ఊహించని విధంగా పెరుగుతున్నాయి..అయితే వ్యాక్సిన్ మీద ప్రయోగాలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి..కాగా కోవిడ్–19 వ్యాక్సిన్ వచ్చే ఏడాది మొదట్లో వస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ చెప్పారు. టీకా భద్రతపై ఎవరికీ సందేహాలు, ఆందోళనలు లేకుండా తానే మొదటి డోసు తీసుకుంటానని స్పష్టం చేశారు. ఆదివారం సామాజిక మాధ్యమాల వేదికగా సండే సంవాద్ కార్యక్రమంలో మంత్రి తన ఫాలోవర్లతో ముచ్చటించారు.
నెటిజన్లు అడిగిన పలు సందేహాలకు ఆయన జవాబులిచ్చారు. ప్రస్తుతం కోవిడ్ పరిస్థితి, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, కోవిడ్ తదనంతర ప్రపంచం ఎలా ఉంటుందన్న దానిపై మాట్లాడారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ప్రయోగాలు బ్రిటన్లో మళ్లీ మొదలైన నేపథ్యంలోనే హర్షవర్ధన్ కరోనా వ్యాక్సిన్పై వివరంగా మాట్లాడారు. డీసీజీఐ అనుమతులు ఇచ్చాక సీరమ్ ఇనిస్టిట్యూట్ భారత్లో కూడా ప్రయోగాలు ప్రారంభించనుంది.
కరోనా వ్యాక్సిన్ ఎవరికైతే∙అత్యవసరమో వారికే ముందు లభిస్తుందని హర్షవర్ధన్ చెప్పారు. ఆర్థికంగా వారికి టీకా కొనుగోలు చేసే శక్తి ఉన్నా లేకపోయినా సీనియర్ సిటిజన్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు తొలి ప్రాధాన్యం ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. ‘‘2021 మొదటి నాలుగు నెలల్లోనే కరోనాకి వ్యాక్సిన్ వచ్చే అవకాశాలున్నాయి. ప్రజల్లో టీకా భద్రతపై భయాలుంటే నేను మొదట వ్యాక్సిన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఫ్రంట్ లైన్ వర్కర్లు, సీనియర్ సిటిజన్లకి మొదట వ్యాక్సిన్ లభించేలా కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటుంది’’అని హర్షవర్ధన్ వెల్లడించారు. టీకా భద్రత, నాణ్యత, ధర, ఉత్పత్తి, సరఫరా వంటి అన్ని అంశాల్లోనూ ఇప్పటికే విస్తృత స్థాయిలో చర్చలు పూర్తయ్యాయని తెలిపారు.