కరోనా వ్యాక్సిన్...మొదటగా ఫ్రంట్లైన్ వర్కర్స్...
By: chandrasekar Wed, 21 Oct 2020 1:19 PM
ప్రభుత్వ, ప్రైవేట్
రంగంలో పనిచేసే ఆరోగ్య కార్యకర్తల డేటాబేస్ను ఎలా తయారు చేయాలో తెలుపుతూ
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ జిల్లా, రాష్ట్రస్థాయి నోడల్ అధికారులకు మార్గదర్శకాలను
జారీచేసింది. ఈ వివరాలనే ఈ- విన్ కింద
కరోనా వ్యాక్సిన్ బెనిఫిషియరీ మేనేజ్మెంట్ సిస్టంలో అప్లోడ్ చేయాల్సిందిగా
సూచించింది. కొవిడ్ వ్యాక్సిన్ లబ్దిదారుల నిర్వహణ వివరాలను ఏ విధంగా పొందుపరచాలో
తెలుపుతూ కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ ఈ మేరకు లేఖ రాశారు. హెల్త్కేర్
వర్కర్స్ కరోనా టీకా డ్రైవ్ లబ్ధిదారులను గుర్తించడానికి ఈ డేటాబేస్ ఉపయోగపడుతుందన్నారు.
ఫ్రంట్లైన్ ఆరోగ్య కార్యకర్తలైన దాదాపు 7 నుంచి 10 లక్షల ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు, సుమారు 15 లక్షల
నర్సులు, వైద్యాధికారులు, ఎంబీబీఎస్, పోస్ట్
గ్రాడ్యుయేట్స్తో సహా అల్లోపతి వైద్యులు, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ డాక్టర్స్, మెడికల్
ఆఫీసర్స్, ఆయూష్ వైద్యులు మొదటగా కరోనా వ్యాక్సిన్ను పొందనున్నారు.
అదేవిధంగా పారామెడికల్ సిబ్బంది డేటాబేస్ సిద్ధం చేయాల్సిందిగా సూచించింది. అన్ని
రకాల టెక్నిషియన్స్, ఫిజియోథెరపిస్టులు, ఫార్మసిస్ట్లు, రేడియోగ్రాఫర్లు, వార్డ్
బాయ్స్, ఇతర
పారామెడికల్ సిబ్బంది, పరిశోధనా సిబ్బంది, వైద్య, దంత, ఆయుష్, నర్సింగ్, పారామెడికల్ విద్యార్థుల జాబితాను కూడా రెడీ చేయాల్సి
ఉంది.
మరో వర్గ కార్మికులకు
కూడా టీకాలు వేయాలని ప్రభుత్వం చూస్తోంది. అవుట్సోర్స్ ఏజెన్సీ ఉద్యోగులు, సెంట్రల్ స్టెరైల్ సప్లై డిపార్ట్మెంట్ సిబ్బంది, క్లరికల్
సిబ్బంది, బయోమెడికల్ వ్యర్థ పదార్థాల నిర్వహణ సిబ్బంది, పారిశుధ్య
కార్మికులు, అంబులెన్స్ డ్రైవర్లు, సెక్యూరిటీ సిబ్బంది, ఇతర
సహాయక సిబ్బంది, డేటా ఎంట్రీ ఆపరేటర్లు కూడా ఈ జాబితాలో ఉన్నారు. 2021 జూలై
నాటికి సుమారు 400 మిలియన్ డోస్ల వ్యాక్సిన్ సమకూర్చుకుంటామని ఈ
సమయానికి 25 నుంచి 30 కోట్ల మంది భారతీయులకు టీకాలు వేస్తామని కేంద్ర
ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ తెలిపారు.