హైదరాబాద్ నిమ్స్లో కరోనా టీకా క్లినికల్ ట్రయల్స్
By: chandrasekar Mon, 06 July 2020 2:25 PM
హైదరాబాద్ పంజాగుట్ట
నిమ్స్లో కరోనా మెడిసన్ కోసం క్లినకల్ ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి. ఈనెల 7వ తేదీ
నుంచి హైదరాబాద్ నిమ్స్లో కరోనా టీకా క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి.
భారత బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ టీకాను మానవులపై ప్రయోగానికి
దేశవ్యాప్తంగా పలు ఆసుపత్రులను ఎంపిక చేశారు. అందులో నిమ్స్ కూడా ఒకటి.
నిమ్స్లో గతంలో పలు
క్లినికల్ ప్రయోగాలు చేపట్టిన నేపథ్యంలో కోవాగ్జిన్ ఫేజ్ 1
ప్రయోగాలు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టు నిమ్స్ డైరెక్టర్ డాక్టర్
మనోహర్ తెలిపారు. క్లినికల్ ప్రయోగాల కోసం ఐసీఎంఆర్ బడ్జెట్ విడుదల చేసినట్టు
చెప్పారు.
టీకా ప్రయోగాల విషయంలో
తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఔషధ ప్రయోగాల నైతిక విలువల కమిటీ శనివారం సమావేశమైందని, ఈ
సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను ఐసీఎంఆర్కు నివేదించనున్నట్టు పేర్కొన్నారు.
అక్కడి నుంచి అనుమతి రాగానే టీకా ప్రయోగాలు ప్రారంభించనున్నట్టు డాక్టర్ మనోహర్
తెలిపారు. వ్యాక్సిన్ ట్రయల్లో పాల్గొంటామని ఇప్పటికే చాలా మంది తమను
సంప్రదిస్తున్నారని చెప్పారు. అయితే వారిలో ఆరోగ్యంగా ఉన్నవాళ్లను ఎంచుకుని వాళ్ల
స్వాబ్, రక్తనమూనాలను
ఢిల్లీలోని ఐసీఎంఆర్ ల్యాబ్ కు పంపిస్తామని వివరించారు.
అక్కడి డాక్టర్లు
సూచించిన వారిపై ట్రయల్స్ చేస్తామన్నారు. మొత్తం 30 నుంచి 60
మందిపై ట్రయల్ చేయనున్నట్టు మనోహర్ వెల్లడించారు. ఒక్కొక్కరికి 14 రోజుల
వ్యవధిలో రెండు డోసుల వ్యాక్సిన్ ఇస్తామన్నారు. వ్యాక్సిన్ ఇచ్చాక తొలి
రెండ్రోజులు అబ్జర్వ్ చేస్తామని, తర్వాత ఇంటికి పంపిస్తామని చెప్పారు. 14 రోజుల
తర్వాత మరో డోస్ ఇస్తామని డాక్టర్లు తెలిపారు.