అనుపమ్ ఖేర్ కుటుంబంలో నలుగురికి కరోనా
By: chandrasekar Mon, 13 July 2020 2:54 PM
బాలీవుడ్ పరిశ్రమకు
ఇప్పుడు కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్, ఆయన
తనయుడు అభిషేక్ బచ్చన్లకు కరోనా సోకిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో నటుడు అనుపమ్
ఖేర్ కుటుంబసభ్యుల్లో నలుగురికి కరోనా వైరస్ సోకడంతో సినీ పరిశ్రమలో కలకలం
రేగుతోంది.
కరోనా వైరస్ ప్రముఖ
సెలెబ్రిటీల్ని వెంటాడుతున్నట్టు కన్పిస్తోంది. ఇప్పటికే బిగ్ బీ అమితాబ్ బచ్చన్, ఆయన
కుమారుడు అభిషేక్ బచ్చన్లకు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణైంది. ముంబైలోని
నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. త్వరగా కోలుకోవాలంటూ చిత్ర పరిశ్రమ
ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు.
ఇప్పుడు బాలీవుడ్ మరో
ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ కుటుంబాన్ని సైతం కరోనా వైరస్ వదల్లేదు. ఆయనింట్లో ఏకంగా
నలుగురికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని స్వయంగా అనుపమ్ ఖేర్ ట్వీట్
ద్వారా వెల్లడించారు. అనుపమ్ ఖేర్ తల్లి, తమ్ముడు, మరదలు, మేనకోడలికి కరోనా పాజిటివ్ గా తేలినట్టు తనకు మాత్రం
రిపోర్ట్ నెగెటివ్గా వచ్చిందని అనుపమ్ ట్వీట్ చేశారు.
ప్రస్తుతం తామంతా హోమ్
క్వారెంటైన్లో ఉన్నామని, తమ్ముడి ఇంటిని శానిటైజ్ చేస్తున్నట్టు ఆయన తెలిపారు.
ప్రస్తుతం అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన చెప్పారు. కరోనా వైరస్ బారిన పడిన
తల్లి దులారిను ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చేర్చినట్టు అనుపమ్ వెల్లడించారు.
బాలీవుడ్ పరిశ్రమలో ఒక్కొక్కరిగా అందరి ఇంటా కరోనా కేసులు బయటపడుతుండటంతో కలవరం
రేగుతోంది. ప్రముఖులు సైతం కరోనా బారిన పడుతుండటంతో అందరూ అప్రమత్తమవుతున్నారు.