Advertisement

భారత్ లో మరో బ్యాడ్మింటన్ ప్లేయర్ కి కరోనా

By: chandrasekar Fri, 28 Aug 2020 1:56 PM

భారత్ లో మరో బ్యాడ్మింటన్ ప్లేయర్ కి కరోనా


రెండు వారాల క్రితం బ్యాడ్మింటన్ ప్లేయర్‌ సిక్కిరెడ్డి కరోనా వైరస్ బారినపడగా తాజాగా బ్యాడ్మింటన్ డబుల్స్ క్రీడాకారుడు సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి‌కి కూడా కరోనా పాజిటివ్‌ అని తేలింది. అందువలన సాత్విక్ ప్రస్తుతం అమలాపురంలోని తన ఇంట్లో క్వారంటైన్‌లో ఉన్నాడు. అర్జున అవార్డుకి ఎంపికైన 20 ఏళ్ల సాత్విక్ శనివారం అవార్డుని అందుకోవాల్సి ఉంది. కరోనా వైరస్ సోకడంపై మీడియాతో సాత్విక్ మాట్లాడుతూ ‘‘దురదృష్టవశాత్తు ఇది అంగీకరించాల్సిన నిజం. కొద్దిరోజుల క్రితం నేను టెస్టు చేయించుకున్నా. ఆ తర్వాత ఆర్‌టీ- పీసీఆర్ టెస్టులోనూ కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉండి మందులు తీసుకుంటున్నా.

నా స్నేహితులు, అమ్మానాన్నలో ఎవరికీ కరోనా వైరస్ సోకలేదు. మరి నాకు మాత్రం ఎలా వచ్చిందో అర్థం కాలేదు. నాలో ఎలాంటి కరోనా వైరస్ లక్షణాలు లేవు. మూడు రోజులు తర్వాత మళ్లీ టెస్టు చేయించుకుంటా’’ అని సాత్విక్ వెల్లడించాడు. సాత్విక్- చిరాగ్ శెట్టి డబుల్స్ జోడీ గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తోంది. 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకం గెలుపొందిన ఈ జంట గత ఏడాది థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్ 500లోనూ విజేతగా నిలిచింది. ఈ కారణంగా ఈ ఏడాది అర్జున అవార్డుకి సాత్విక్ - చిరాగ్ జోడీని ఎంపిక చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా వర్చువల్‌గా ఈ అవార్డుల ప్రదానోత్సవం జరగనుండగా కార్యక్రమానికి సాత్విక్ దూరంగా ఉండబోతున్నట్లు భారత క్రీడాప్రాధికార సంస్థ తెలిపింది.

Tags :
|

Advertisement