కరోనా సెకండ్ వేవ్ ...బ్రిటన్ లో నాలుగు వారాల కఠిన లాక్ డౌన్
By: Sankar Mon, 02 Nov 2020 2:19 PM
యూరోప్లో మళ్లీ కోవిడ్19 కేసులు ప్రబలుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తమ పార్టీ ఎంపీలకు వార్నింగ్ ఇవ్వనున్నారు.
కరోనా మహమ్మారి వల్ల తొలి దశలో సంభవించిన మరణాల కన్నా.. రెండవ దఫా సంక్రమించే కేసులతో మృతుల రేటు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నట్లు ప్రధాని బోరిస్ వార్నింగ్ ఇవ్వనున్నారు. పార్లమెంట్లో ఆయన ఇవాళ ప్రకటన చేసే అవకాశం ఉన్నది. దీనికి మరో ప్రత్యామ్నాయం ఏమీ లేదన్నారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. ఇంగ్లండ్లో మళ్లీ నాలుగు వారాల లాక్డౌన్లు అమలు చేయనున్నారు.
ప్రజలను ఇంటికి పరిమితం కావాలంటూ అక్కడ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. లాక్డౌన్ అమలుకు లేబర్ పార్టీ ఆమోదించింది. కానీ ఆలస్యం కావడాన్ని ఆ పార్టీ తప్పుపడుతోంది. గురువారం నుంచి కఠినంగా లాక్డౌన్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు శనివారం బోరిస్ ప్రకటించిన విషయం తెలిసిందే. పబ్లు, రెస్టారెంట్లు, జిమ్లు, షాపులు, ప్రార్థనా స్థలాలను మూసివేస్తున్నట్లు ఆయన తెలిపారు. బుధవారం జరిగే పార్లమెంట్ ఓటింగ్లో మరిన్ని వివరాలను వెల్లడించనున్నారు.