రికార్డు స్థాయిలోపెరిగిన కరోనా రికవరీ రేటు
By: chandrasekar Tue, 22 Sept 2020 5:39 PM
భారత్లో కరోనావైరస్ మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తూనే ఉంది. గత
కొన్నిరోజుల నుంచి నిత్యం 90 వేలకు పైగా నమోదైన కేసులు కాస్తా రెండురోజుల నుంచి తగ్గుతూ వస్తున్నాయి. ఉపశమనం
కలిగించే విషయం ఎమిటంటే గతంలో ఎన్నడూ లేని విధంగా కరోనా రికవరీ రేటు రికార్డు
స్థాయిలో పెరుగుతోంది. గత 24 గంటల్లో సోమవారం
దేశవ్యాప్తంగా కొత్తగా 75,083 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి
కారణంగా నిన్న 1,053 మంది మరణించారు. తాజాగా నమోదైన గణాంకాలతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 55, 62,664 పెరగగా మరణాల సంఖ్య 88,935 కి చేరింది.
ఈ మేరకు కేంద్ర
వైద్యఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్ను విడుదల చేసింది. ఇప్పటివరకు
దేశవ్యాప్తంగా 44,97,868 మంది కరోనా మహమ్మారి నుంచి డిశ్ఛార్జ్ కాగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా 9,75,861 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇదిలాఉంటే గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 1,01,468 మంది కరోనా బాధితులు కోలుకున్నారని ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇదిలాఉంటే సోమవారం దేశవ్యాప్తంగా 9,33,185 కరోనా టెస్టులు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వెల్లడించింది. తాజాగా నిన్న చేసిన టెస్టులతో
సెప్టెంబరు 21 వరకు మొత్తం 6,53,25,779 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ పేర్కొంది.
ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 80 శాతం దాటగా మరణాల రేటు 1.60 శాతం
ఉంది.