అంతర్వేదిలో రథం దగ్ధం ఘటన ఆందోళనకారులకు మరియు పోలీసులకు కరోనా పాజిటివ్
By: chandrasekar Mon, 14 Sept 2020 09:08 AM
ప్రఖ్యాతి గాంచిన
అంతర్వేదిలోని రథం దగ్ధం ఘటనకు ఆందోళన
చేసిన వారికి మరియు పోలీసులకు కరోనా పాజిటివ్ గుర్తించ బడింది. తూర్పు గోదావరి
జిల్లా అంతర్వేదిలో రథం దగ్ధం ఘటనకు సంబంధించి చేసిన భారీ ఆందోళన వల్ల జిల్లాలో
కలకలం రేపుతోంది. రథం దగ్ధానికి నిరసనగా బీజేపీ, హిందూ సంఘాలు ఇచ్చిన
పిలుపు మేరకు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే.
రథం దగ్ధం ఘటన ఆందోళనలో
పాల్గొన్న పలువురికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. అలాగే వారిని అరెస్టు
చేసిన పోలీసులకు సైతం కరోనా సోకింది. అరెస్టు అయిన మొత్తం 36 మంది
నిందితుల్లో ఇద్దరికి కరోనాగా నిర్ధారణ అయింది. దీంతో ముందస్తు జాగ్రత్తగా పోలీసు
అధికారులు కూడా పరీక్షలు చేసుకున్నారు. దీంతో జిల్లా అదనపు ఎస్పీ కరణం కుమార్కు
కరోనా పాజిటివ్గా తేలింది. ఆయనతో పాటు ఈ కేసును విచారించిన ఎస్పీ నయీమ్ ఆస్మి, రాజోలు
సీఐ దుర్గా శేఖర్ రెడ్డి, ఆయన డ్రైవర్, రైటర్, మరో ఐదుగురు ఎస్ఐలకు సైతం కరోనా పాజిటివ్గా నిర్ధారణ
అయ్యింది.
వీరందరూ క్వారంటైన్ కి
వెళ్లి వైద్యుల సూచనల మేరకు చికిత్స తీసుకుంటున్నారు. పలువరు పోలీసు అధికారులు
స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. తూర్పు గోదావరి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం
అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో ఈ నెల 6న
ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. 62 ఏళ్ల చరిత్ర కలిగిన స్వామి వారి రథం అగ్నికి
ఆహుతైంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, అంతలోనే
బీజేపీ, జనసేన, పలు
హిందూ సంఘాలు ఆందోళనలకు పిలుపునిచ్చాయి.
కరోనా మహమ్మారిని లెక్క
చేయకుండా ఆందోళనలో పాల్గొన్న చాలా మందికి కరోనా వైరస్ వ్యాపించింది. ఈ తరుణంలో
అంతర్వేదిలో మంత్రులు పర్యటించగా, ఆ సమయంలో పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన
నిర్వహించారు. తాజాగా, వీరిలో పలువురికి కరోనా రావడం కలకలం రేపుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలో పాల్గొనడంతో ఇంకా
ఎవరెవరికి కరోనా సోకి ఉంటుందోనన్న కలవరం మొదలైంది. ఇక వీళ్ళందరూ టెస్టులు
చేసుకున్నట్లైతే బాధిత వివరాలు తెలుస్తుంది.