ఐసీఎంఆర్ నిర్వహించిన సర్వేలో 18 ఏండ్లు పైబడిన 64 లక్షల మందికి కరోనా
By: chandrasekar Sat, 19 Sept 2020 09:24 AM
దేశంలో ఐసీఎంఆర్
నిర్వహించిన సర్వేలో 18 ఏండ్లు పైబడిన 64 లక్షల మందికి
కరోనా సోకినట్లు గుర్తించారు. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్)
ఏప్రిల్-మేలో నిర్వహించిన సెరో సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. 18
ఏండ్లు పైబడిన 64 లక్షల మంది కరోనా బారిన పడినట్లు తెలిసిందని ఎయిమ్స్కు
చెందిన కమ్యూనిటీ మెడిసిన్ విభాగం అధిపతి డాక్టర్ సంజయ్ రాయ్ తెలిపారు.
కానీ సెరో సర్వే ద్వారా
వైరస్ వ్యాప్తి దిశ గురించి మాత్రమే తెలుస్తుందని, కరోనా పరీక్షల ద్వారానే
వాస్తవ సంక్రమణ సంఖ్య తెలుస్తుందని చెప్పారు. దేశంలో కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్
రెండో దశ జరుగుతున్నదని, 600 మందికిపైగా వలంటీర్లు ముందుకు వచ్చినట్లు ఆయన
తెలిపారు. ప్రతిదీ ప్రణాళిక ప్రకారం, అంతా అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది జూన్, జూలై
మధ్య ప్రపంచంలో ఎక్కడో ఒక చోట కరోనా టీకా అందుబాటులోకి వస్తుందని డాక్టర్ సంజయ్
రాయ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా అనేక
ఫార్మసీ కంపెనీల వాక్సిన్ లు మూడవ దశ ట్రయల్స్ లో ఉండగా ఎప్పుడు అందుబాటులోకి
వస్తాయో కచ్చితంగా తేలలేదు. అయితే అప్పటికీ టీకా వచ్చినా, రాకపోయినా
అంతా సాధారణ స్థితికి వచ్చే అవకాశమున్నదని ఆయన అన్నారు. సమర్థవంతమైన వ్యాక్సిన్
అందుబాటులోకి రానంత వరకు కరోనా నివారణ చర్యలైన మాస్కులు ధరించడం, చేతుల
పరిశుభ్రత, భౌతిక దూరం వంటివి పాటించాలని పేర్కొన్నారు. లేని
పక్షంలో వ్యాప్తి మరింతగా ప్రబలుతుందని తెలిపారు.