గిలోయ్ మరియు అశ్వగంధ మూలికల తో కరోనా ఖతం: రాందేవ్ ప్రకటన
By: chandrasekar Fri, 12 June 2020 5:24 PM
కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసింది. 6 నెలలుగా అన్ని దేశాలను పట్టి పీడిస్తోంది. ఈ వైరస్ ని తరిమికొట్టేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. డ్రగ్తో పాటు వాక్సీన్ కనిపెట్టేందుకు చాలా దేశాలు తీవ్రంగా కృషిచేస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు ఎలాంటి మందు అందుబాటులోకి రాలేదు. రెమడిసివిర్, హైడ్రాక్సిక్లోరోఫిన్ వంటి పలు యాంటి వైరల్ డ్రగ్స్ కొంత సత్ఫలితాలను ఇస్తున్నాయి. కరోనాను ఖతం చేసే డ్రగ్ కోసం శాస్త్రవేత్తలు తమ పరిశోధనలు కొనసాగిస్తున్న క్రమంలో ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా సంచలన ప్రకటన చేశారు. కరోనాను తరిమికొట్టే మందును పతంజలి కనిపెట్టిందని వెల్లడించారు.
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రాందేవ్ బాబా కరోనా మహమ్మారికి తమ వద్ద విరుగుడు ఉందని చెప్పారు. గిలోయ్ (తిప్పతీగ), అశ్వగంధ మూలికలతో కరోనాను తరిమికొట్టవచ్చని ఆయన తెలిపారు. ఇప్పటికే పలువురు కరోనా రోగులకు ఈ మూలికలతో ఆయుర్వేద చికిత్స అందించామని వారంతా కోలుకున్నారని వెల్లడించారు.
గిలోయ్, అశ్వగంధ మూలికలను ఖాళీ కడుపుతోనూ, తిన్న తరువాత కూడా రోగులకు ఇచ్చామని చెప్పారు. ఈ ఔషధం వందకు వంద శాతం సమర్థవంతంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. శరీరం లోపల కరోనా సంక్రమణ గొలుసును విచ్ఛిన్నం చేయడంలో తిప్పతీగ, అశ్వగంధ ప్రభావమంతంగా పనిచేసిందని రాందేవ్ తెలిపారు. ఈ మందు తీసుకున్న వారంతా కోలుకున్నారని ఎవరూ చనిపోలేదని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పతంజలిలో క్లినికల్ ట్రయల్స్, పరిశోధనలు జరుగుతున్నాయన్న ఆయన త్వరలోనే శాస్త్రీయ అధ్యయనాన్ని ప్రపంచం ముందుకు తీసుకొస్తామని వెల్లడించారు.
కరోనాను పోలిన వైరస్ను తరిమికొట్టడంలో పలు ఆయుర్వేద మూలికలు సమర్ధవంతంగా పనిచేస్తాయని ఇటీవల భారత వ్యవసాయ పరిశోధనా మండలి తెలిపింది. అంతేకాదు ఐఐటీ ఢిల్లీ, జపాన్కు చెందిన AIST ఇప్పటికే అశ్వగంధపై సంయుక్త పరిశోధనలు చేశాయి. కోవిడ్ 19 చికిత్సకు అశ్వగంధ సమర్ధవంతంగా పనిచేస్తుందని తమ పరిశోధనల్లో తేలినట్లు వెల్లడించాయి. బాబా రాందేవ్ చేసిన ఈ ప్రకటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.