తెలంగాణలో కరోనా మరింతగా విజృంభణ
By: chandrasekar Fri, 05 June 2020 5:29 PM
తెలంగాణలో కరోనా మరింతగా
విజృంభిస్తున్నది. వైరస్ కాటుకు బలైపోతున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది.
రాష్ట్రవ్యాప్తంగా గురువారం ఒక్కరోజే 127 కొత్త కేసులు నమోదుకాగా అత్యధికంగా జీహెచ్ఎంసీ
పరిధిలోనే 110 కేసులు వచ్చాయి. కొత్తవాటిని కలుపుకొంటే రాష్ట్రంలో
మొత్తం కేసుల సంఖ్య 3147కు చేరింది. ఇందులో 2,699 కేసులు లోకల్వి కాగా, మిగతావి
వలసదారులు, విదేశాల నుంచి వచ్చినవాళ్లవని ఆరోగ్య శాఖ పేర్కొంది.
కరోనా కాటుకు గురువారం
ఒక్కరోజే ఆరుగురు మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 105కు
పెరిగింది. గడచిన నాలుగు రోజుల్లోనే 23 మంది మృత్యువాత పడ్డటం గమనార్హం. బుధవారంనాడు
ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల్లో ప్రస్తుతానికి 1,587 మంది
వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిపోగా,
1,455 మంది చికిత్స పొందుతున్నారు.
హైదరాబాద్ పరిధిలో వైరస్
విస్పోటనం కొనసాగుతున్నది. గురువారం నాటి 110 కేసులను కలుపుకొంటే జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం కేసుల
సంఖ్య 2002కు
పెరిగింది. చనిపోయినవాళ్లలో హైదరాబాదీల సంఖ్య 81గా ఉంది. జీహెచ్ఎంసీ రెడ్ రోజ్ లో ఉండటంతో 143
కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటుచేశారు. అయినాసరే వ్యాప్తి కొనసాగుతుండటం విచారకరం.
ఇవాళ్టి కొత్త కేసుల్లో
జీహెచ్ఎంసీలో 110 రాగా, రంగారెడ్డి జిల్లాలో 6, ఆదిలాబాద్లో 7, మేడ్చల్లో
2, సంగారెడ్డి, ఖమ్మంలో
ఒక్కొక్కటి చొప్పున గుర్తించారు. మొత్తం కేసుల్లో గ్రేటర్ తర్వాత 128
కేసులతో రంగారెడ్డి జిల్లా రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత సూర్యాపేట జిల్లా(83), నిజామాబాద్(61), మేడ్చల్(51) ఉన్నాయి.