Advertisement

  • విపక్షంలోని ఓ సీనియర్ నాయకుడికి కరోనా పాజిటివ్

విపక్షంలోని ఓ సీనియర్ నాయకుడికి కరోనా పాజిటివ్

By: chandrasekar Mon, 22 June 2020 11:55 AM

విపక్షంలోని ఓ సీనియర్ నాయకుడికి కరోనా పాజిటివ్


తెలంగాణలో ఇప్పటికే పలువురు అధికార పార్టీలో పలురువు ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులకు కరోనా సోకగా తాజాగా విపక్షంలోని ఓ సీనియర్ నాయకుడు సైతం కరోనా బారిన పడ్డారు. తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలోని సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్)కు కరోనా ఉన్నట్లు వైద్యులు నిర్ధరించారు.

కొద్ది రోజులుగా ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆయన్ను కుటుంబ సభ్యులు అపోలో ఆస్పత్రిలో చేర్చారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోనే అత్యంత సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు. ఆయన వయసు 72 ఏళ్లు. ఈ వయసులో ఆయనకు కరోనా సోకడంతో వైద్యులు ప్రత్యేక శ్రద్ధ కనబర్చి ఆయన ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ ఉంచుతున్నట్లు సమాచారం.

కరోనా లక్షణాలుగా గుర్తించి వైద్యులు ఆయనకు కరోనా టెస్టులు చేయగా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం వీహెచ్ అపోలో ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. అంతేకాక, కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో నేత గూడూరు నారాయణ రెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే.

అధికార పార్టీలో అయితే ముగ్గురు ఎమ్మెల్యేలు, బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కరోనా బారిన పడ్డారు. ఇటు మంత్రి ప్రజా ప్రతినిధుల అనుచరులు సైతం కరోనా బారిన పడుతుండడంతో వారిలో ఆందోళన నెలకొంది. మంత్రి హరీశ్ రావు డ్రైవర్, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గన్‌మేన్‌కు కరోనా సోకిన విషయం తెలిసిందే.

Tags :
|
|

Advertisement