అసెంబ్లీ సమావేశాల సమయంలో పాటించాల్సిన నిబంధనలను విడుదల చేసిన స్పీకర్ పోచారం
By: Sankar Fri, 04 Sept 2020 6:00 PM
కరోనా పరీక్షల్లో పాజిటివ్ వస్తే అసెంబ్లీకి రావద్దని సూచించారు శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభంకానున్న అసెంబ్లీ సమావేశాల్లో తీసుకోవాల్సిన కరోనా జాగ్రత్తలపై శుక్రవారం ప్రెస్ మీట్ లో మాట్లాడారు పోచారం. ప్రత్యేక పరిస్థితుల్లో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరగబోతున్నాయని.. సమావేశాల నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు అధికారులు, సిబ్బంది, పోలీసులు, మీడియా ప్రతినిధులు, మంత్రుల పీఎస్లు, పీఏలు తప్పనిసరిగా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలన్నారు. కొవిడ్ పాజిటివ్ తేలితే అసెంబ్లీ ప్రాంగణంలోకి రావద్దని స్పీకర్ రిక్వెస్ట్ చేశారు. మాస్కు ఉంటేనే సభలోకి అనుమతి ఉంటుందని.. జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలు ఉంటే అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించరన్నారు. శరీర ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉంటేనే అనుమతి ఉంటుందని తెలిపారు స్పీకర్.
20 నుంచి 21 రోజులు సభ నడువొచ్చు అనుకుంటున్నామని.. అసెంబ్లీకి వచ్చే వాళ్ళు తమ బంధువుల ఫంక్షన్లు, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లకుండా చూసుకోవాలన్నారు. అసెంబ్లీ నుంచి ఇంటికి ఇంటినుంచి అసెంబ్లీకి వచ్చే విధంగా చూసుకోవాలని.. ప్రభుత్వం తరుపున శాసన సభ్యులు, మండలి సభ్యులకు కిట్ ఇస్తున్నామని చెప్పారు. అందులో ఆక్సి మీటర్, శానిటైజేర్ ఇస్తున్నామని.. ఆక్సిజన్ పర్సెంటేజ్ 90 లోపు ఉంటే సభకు రావొద్దని… ఈ సెషన్కు విజిటర్స్కు అనుమతి లేదని తెలిపారు పోచారం.