Advertisement

2021 ఫిబ్రవరి నాటికి దేశంలో సగం మందికి కరోనా...?

By: chandrasekar Tue, 20 Oct 2020 12:42 PM

2021 ఫిబ్రవరి నాటికి దేశంలో సగం మందికి కరోనా...?


2021 ఫిబ్రవరి నాటికి 130 కోట్ల దేశ జనాభాలో సగం మందికి కరోనా సోకే అవకాశమున్నదని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ పేర్కొంది. ‘మా గణిత నమూనా అంచనా ప్రకారం ప్రస్తుతం జనాభాలో 30 శాతం మందికి కరోనా సోకింది. ఫిబ్రవరి నాటికి ఇది 50 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది’ అని కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ ప్రొఫెసర్, కమిటీ సభ్యుడు మనీంద్ర అగర్వాల్ అన్నారు.

కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్‌లో నిర్వహించిన సెరోలాజికల్ సర్వే ప్రకారం దేశ జనాభాలో 14 శాతం మందికి వైరస్‌ సోకినట్లు తెలిపారు. గత నెల రోజుల్లో వైరస్‌ వ్యాప్తి బాగా పుంజుకోవడంతో దేశ జనాభాలో 30 శాతం మంది కరోనా బారినపడ్డారని తెలిపారు. అయితే జనాభా భారీ పరిమాణం కారణంగా సెరోలాజికల్ సర్వే ద్వారా నమూనాలను సరిగా అంచనా వేయలేకపోయినట్లు అగర్వాల్‌ అన్నారు.

మరోవైపు వైరాలజిస్టులు, శాస్త్రవేత్తలు, ఇతర నిపుణుల కమిటీ గణితం నమూనా ఆధారంగా రూపొందించిన నివేదికను ఆదివారం వెల్లడించినట్లు చెప్పారు. ‘మేము ఒక కొత్త మోడల్‌ను రూపొందించాం. ఇది రిపోర్ట్ చేయని కేసులను కూడా స్పష్టంగా పరిగణనలోకి తీసుకుంటుంది. దీని ప్రకారం వైరస్‌ సోకిన వారిని రెండు వర్గాలుగా విభజించవచ్చు. నమోదైన కరోనా కేసులతోపాటు నమోదు కాని వాటి గురించి కూడా అంచనా వేయవచ్చు’ అని అగర్వాల్ పేర్కొన్నారు.

Tags :
|
|

Advertisement