Advertisement

దాబాలో పనిచేసే 75 మందికి కరోనా

By: chandrasekar Fri, 04 Sept 2020 6:41 PM

దాబాలో పనిచేసే 75 మందికి కరోనా


కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపించడంతో హరియాణాలోని రెండు దాబాల్లో పనిచేస్తున్న 75 మందికి కరోనా వైరస్ సోకింది. ఓ దాబాలోనే 65 మంది వైరస్ బారిపడ్డారు. దీనికి పక్కనే ఉన్న మరో దాబాలోని 10 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. ముర్తాల్ ప్రాంతంలో ఉన్న ఈ దాబాలను పోలీసులు ప్రస్తుతం మూసివేశారు. ముర్తాల్‌లోని ఆమ్రిక్ సుఖ్‌దేవ్ దాబాకు చుట్టుపక్కల ప్రాంతాల్లో మంచి గుర్తింపు ఉంది. ఆమ్రిక్ సుఖ్‌దేవ్ దాబాలో పనిచేస్తున్న 65మంది వర్కర్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీన్ని ఆనుకొని ఉన్న ఈటరీలో 10మందికి కూడా కరోనా సోకడంతో రెండు దాబాలను సీల్ చేసినట్లు సోనేపట్ డిప్యూటీ కమిషనర్ శ్యామ్ లాల్ పూనియా వెల్లడించారు.

సీల్ చేసిన దాబాలను తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ వీటిని మూసి ఉంచాలని ఆయన ఆదేశించారు. అలాగే కరోనా సోకిన వ్యక్తులతో కాంటాక్ట్‌ అయిన వారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ఆ ప్రాంతంలో శానిటైజేషన్ చేపట్టాలని జిల్లా యంత్రాంగాన్ని కోరినట్టు వివరించారు. దీనిపై దాబా యజమాని ఆమ్రిక్ సింగ్ మాట్లాడుతూ ఇటీవలే రెస్టారెంట్‌లో పనిచేయడానికి బీహార్ నుంచి 100 మంది పనివాళ్లను రప్పించామన్నారు. వారిలోనే 65 మంది కరోనా వైరస్ బారినపడ్డారని తెలిపారు. వీళ్ళు సరిగ్గా నిబంధనలు పాటించకపోవడంతో కరోనా వ్యాపించినట్లు చెపుతున్నారు.

ప్రసిద్ధి చెందిన ముర్తాల్ దాబాలకు జనాలు ఎక్కువగా వస్తుంటారు. దేశ రాజధానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఢిల్లీ-అంబాలా జాతీయ రహదారిపై ఇది వుంది. ఢిల్లీ నుంచి చాలా మంది ప్రత్యేకంగా దాబాల్లో ఆహారం కోసం వెళ్తుంటారు. దాబాల్లో పనిచేసే కార్మికుల కోసం ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించి, వారి రక్త నమూనాలను సేకరించి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు సోనేపట్ డిప్యూటీ కమిషనర్ తెలిపారు. దాబాల్లో భౌతిక దూరం సహా కోవిడ్ నిబంధనలు సక్రమంగా అమలు చేస్తున్నారా? లేదా? అనేది అధికారులు రోజువారీ తనిఖీలు చేస్తున్నారని పేర్కొన్నారు.

Tags :
|
|

Advertisement