Advertisement

కరోనా భయమే రోగం...ధైర్యమే జీవితం

By: chandrasekar Wed, 05 Aug 2020 11:48 AM

కరోనా భయమే రోగం...ధైర్యమే జీవితం


కరోనాను మించి 'భయం' అనే రోగమొకటి వచ్చేసింది. ‘నాకూ కూడా వైరస్‌ సోకుతుందేమో’ అన్న ఆలోచన ఆందోళన అతి భయంగా మారి మెదడును తొలిచేస్తున్నది. చావు అన్న అతి ప్రమాదకరమైన స్థితికి తీసుకెళ్తున్నది. ఫలితంగా ఆరోగ్యవంతులు, కరోనా ప్రాథమిక లక్షణాలు ఉన్నవారూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అయితే వందలో 99 మంది కోలుకుంటున్నారని, పసిగుడ్డు నుంచి పండు ముసలివరకు కరోనాను ఒంటిచేత్తో గెలిచారనే విషయాన్నీ మరచిపోతున్నారు. జాగ్రత్తగా ఉంటే కరోనా దరి చేరదని తెలిసి కూడా ఆరోగ్యంగానే ఉన్నాం అని శరీరం చెప్తున్నా వినకుండా తనువు చాలిస్తున్నారు. అనవసర భయంతో కుటుంబాన్ని వీధిన పడేస్తున్నారు.

హైదరాబాద్‌లోని ఎంఎస్‌ మక్తాలో వృద్ధ దంపతులకు జ్వరం, దగ్గు రావడంతో కరోనా సోకిందని అనుమానించారు. తమ వల్ల ఈ మహమ్మారి కొడుకులకు, వారి పిల్లలకు అంటుకుంటుందేమోననే ఆందోళనతో ఆత్మహత్య చేసుకున్నారు. ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపారు. కరోనా మించిన రోగం ‘భయం’ వారిని బలితీసుకున్నది. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ రియా దవాఖానలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న యాదగిరికి (35) శనివారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. డాక్టర్ల సూచన మేరకు ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్నారు. హాస్పిటల్ లో పనిచేస్తున్నా వేల మంది కరోనాను నుంచి కోలుకున్న్నారని తెలిసినా ఆయనను భయం ఆవహించింది. మనస్థాపంతో ఆదివారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. భార్యను ఒంటరిని చేశారు.

కరోనా మహమ్మారి కంటే ముందే భయం అనే వ్యాధి చంపేస్తున్నది. యువకులు, వృద్ధులు అన్న తేడా లేకుండా వారి గుండె లయను నిలిపివేస్తూన్నది. కొందరు కరోనా సోకినవాళ్లు, సోకిందేమోనన్న అనుమానం ఉన్నవాళ్లు క్షణమొక యుగంలా, దినదిన గండంలా జీవిస్స్తున్నారు. ఈ భయాన్నే వైద్య పరిభాషలో ‘అగోరాఫోబియా’ అంటారు. కరోనా నుంచి కోలుకోవాల్సిన వాళ్లు కూడా తీవ్ర మానసిక ఆందోళనకు గురై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇటీవల కాలంలో సైకాలజిస్టుల దగ్గరికి వచ్చే ప్రతి పదిమందిలో ఆరేడుగురు కరోనాతో ముడిపడి ఉన్నవారేనట. భయం పాముకాటు మాదిరేనని సైకాలజిస్టులు చెప్పారు.

పాముకాటేయగానే, విష ప్రభావం కంటే ముందు.. చనిపోతామేమోనన్న భయం తో గుండెపోటు వచ్చి చనిపోయినవాళ్లే ఎక్కువగా ఉంటారని వివరించారు. అలాగే, వైద్యులు కరోనాకు చికిత్స అందిస్తున్నా బాధితుడిలో మానసిక ఆందోళన ఎక్కువై, అది గుండెపై ప్రభావం చూపుతున్నదని వెల్లడించారు. కడప జర్నలిస్టు విషయంలోనూ ఇదే కనిపించింది. వెంటిలేటర్‌ ద్వారా ఆక్సిజన్‌ అందిస్తున్నా తనకు ఊపిరి ఆడటం లేదని చెప్పడం విపరీతమైన మానసిక ఆందోళనేనని విశ్లేషించారు. ఇక కరోనా సోకుతుందేమోననే భయంతో దేశవ్యాప్తంగా అనేక మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. నమ్ముకున్న కుటుంబాలను నట్టేట ముంచి అనవసరంగా ప్రాణాలు విడుస్తున్నారు.

‘పాజిటివ్‌'ను మరచిపోతున్నారు:

రాష్ట్రంలో రికవరీ రేటు సుమారు 75 శాతం ఉన్నది. మరణాల రేటు జాతీయ సగటు 2.4 ఉంటే, తెలంగాణలో 1 శాతం కన్నా తక్కువగా ఉంది. అంటే కరోనా సోకినా 99 మంది కోలుకుంటున్నారు. 20 రోజుల పాప నుంచి వందేండ్ల వృద్ధుల వర కు కరోనాను జయించినవారే. ఇంట్లోనే ఉండి కోలుకున్నవారు లక్షల్లో ఉన్నారు. రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వ దవాఖానల్లో ఉచితం గా వైద్యం పొందినవారు వేలల్లో ఉన్నారు. పాజిటివ్‌ అంశాలు మీడియాలో విస్తృతంగా వస్తున్నాయి. భయాన్ని పెంచే వార్తలకు బదులు ఇవి చూడాలని నిపుణులు సూచిస్తున్నారు.

సాధారణ వ్యక్తు లు కూడా కరోనా గురించి అదే పనిగా ఆలోచి స్తూ ఆందోళనకు గురవుతున్నారని మానసిక నిపుణులు వెల్లడించారు. కొందరు విద్యార్థులు కూడా చదువు ఏమవుతుందో? కరోనా ఇంకెం త కాలం? అంటూ ఆలోచిస్తున్నారని తెలిపారు. అలాంటివారికి యోగా, కౌన్సెలింగ్‌, పలకరింపులే సరైన మందని పేర్కొన్నారు. కరోనా గురించి ఎక్కువగా ఆరాతీయడం. కరోనా వార్తలు ఎక్కువగా చూడటం, వాటిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడం, చికిత్సకు రూ.లక్షలు అవుతాయనే భయంతో ముందే కూడబెట్టడం వంటి లక్షణాలు మన ఇంట్లోని వ్యక్తుల్లో ఎవరికైనా గుర్తిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. వారు పానిక్‌ అటాక్‌కు దగ్గరగా ఉన్నట్టు నిర్ధారించుకోవాలి. వారిని ఒంటరిగా వదిలేయకుండా ధైర్యం చెప్పాలి. పాజిటివ్‌ వార్తలు చూపించాలి. అవసరమైతే వెంటనే కౌన్సిలింగ్‌ ఇప్పించాలి. ముఖ్యంగా ఇంట్లో పెద్దవాళ్లు ధైర్యంగా ఉండాలి. మన ఇంట్లో లేదా పక్క ఇంట్లో ఎవరికైనా కరోనా సోకితే వారిని అసహ్యించుకునే బదులు ధైర్యం చెప్పాలి.

పానిక్‌ అటాక్‌ డిజార్డర్‌:

ఒక విషయం గురించి తీవ్ర ఆందోళన చెందుతూ అనారోగ్యానికి గురవడాన్ని వైద్యపరిభాషలో పానిక్‌ అటాక్‌ డిజార్డర్‌ అంటారు. అతి భయం, ఆందోళన వల్ల కొందరిలో రక్తపోటు, గుండె కొట్టుకునే వేగం పెరిగిపోతుంది. విపరీతంగా చమటలు వస్తాయి. శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. కాళ్లు, చేతులు వణికిపోతుంటాయి. చాతినొప్పి, కడుపునొప్పి వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. కొందరు బీపీ పడిపోయి సొమ్మసిల్లుతారు. ఇది దాదాపు గుండెపోటు వంటిదేనని మానసిక వైద్యులు చెప్తున్నారు.

నరాల్ని ఉత్తేజపరిస్తేనే సాధారణ స్థితి:

సాధారణంగా మనిషికి తనకేదో అయిపోతుందనే భయం మొదలైనపుడు మెదడులో రసాయన చర్యలు మొదలవుతాయి. ఈ క్రమంలో తీవ్ర ఒత్తిడికి లోనవుతాడు. దాని పర్యవసానం ఏంటో తెలుసుకోవాలన్న ఉత్సుకత క్రమంగా పెరిగి డిప్రెషన్‌లోకి వెళతాడు. ఈ క్రమంలోనే మెదడులోని పారా సింపథిటిక్‌ నరాలు ఉత్తేజం చెందాలి. సాధారణంగా అవి వాటంతట అవే యాక్టివేట్‌ కావు. ఇందుకోసమే వైద్యులు రకరకాల మార్గాల్ని సూచిస్తారు. ఇందులో భాగంగా యోగా, ప్రాణాయామం చేయిస్తారు. దగ్గరివాళ్లతో మాట్లాడించి సాంత్వన కలిగిస్తారు. అలా నరాలు ఉత్తేజితం అయ్యి సాధారణ స్థితికి వస్తాడు.

Tags :
|
|

Advertisement