కరోనా మరణాల్లో ఎక్కువగా వారే
By: Sankar Sat, 30 May 2020 3:56 PM
ఇండియా కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది ..మరణాల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ , కేసులు మాత్రం భారీగానే పెరుగుతున్నాయి..తెలంగాణలో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది..అయితే కరోనా మరణాల్లో ఎక్కువగా వృద్దులు , షుగర్ , బీపీ ఉన్న వాళ్ళు ఉన్నారు .. గురువారం నాటికి తెలంగాణలో 67 మంది కరోనా వైరస్తో మృతి చెందగా..వీరిలో 57 మంది గ్రేటర్ హైదరాబాద్ వాసులే ఉన్నారు. 51 ఏళ్లు పైబడిన వారు 39 మంది ఉండగా, 41 ఏళ్ల నుంచి 50 ఏళ్లలోపు వారు 11 మంది ఉన్నారు. 50 శాతం మంది మృతుల్లో మధుమేహం, హైపర్టెన్షన్, నిమోనియా కామన్గా కన్పించాయి. మరికొంత మందిలో హైపర్టెన్షన్, మ ధుమేహంతో పాటు కిడ్నీ ఫెయిల్యూర్, గుండెపోటు, కేన్సర్లు కూడా కారణమని స్పష్టమైంది.
హైదరాబాద్ నగరంలో మార్చి 2న తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ప్రభుత్వం 22న జనతా కర్ఫ్యూ ప్రకటించింది. ఆ తర్వాతి రోజు నుంచి వరుస లాక్డౌన్లను ప్రకటిస్తూ వచ్చింది. నిజానికి ఈ లాక్డౌన్ సమయంలో వీరంతా ఇంటి గడప కూడా దాటలేదు. కానీ వైరస్ బారిన పడి మృత్యువాతపడటం ఆందోళన కలిగించింది. కుటుంబ సభ్యులు నిత్యవసరాల పేరుతో మార్కెట్లలో తిరిగి వచ్చారు. టైం పాస్ కోసం ఇరుగు పొరుగు వారితో కలిసి అష్టా చెమ్మా వంటి ఆటలు కూడా ఆడారు.
లాక్డౌన్ నిబంధనలు సడలించడం, నాలుగైదు కుటుంబాలు ఒకే చోటకు చేరడం, వివిధ రకాల వేడుకల పేరుతో విందులు ఏర్పాటు చేయడం, ఈ వేడుకల్లో పిల్లలూ పాల్గొనడం, ఇంటికి వచ్చిన తర్వాత తాత, నానమ్మ, అమ్మమ్మలతో ఆడుకుంటున్నారు. ఇలా పెద్దల నుంచి పిల్లలకు, వారి నుంచి వృద్ధులకు వైరస్ విస్తరిస్తుంది. కిడ్నీ సంబంధ సమస్యతో బాధపడుతున్న మరికొంత మందికి డయాలసిస్ కేంద్రాల ద్వారా వైరస్ విస్తరించింది. వారి మృత్యు వాతకు కారణమైంది. ఒక్కరి మరణంతో ఆ కుటుంబ సభ్యులతో పాటు బంధువులు కూడా క్వారంటైన్లోకి వెళ్లాల్సి వచ్చింది. ఒక్కో మృతుని కుటుంబంలో 15 నుంచి 30 పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం.