గాంధీలో ఆస్పత్రిలో కరోనా మృత దేహం...పట్టించుకోని సిబ్బంది
By: chandrasekar Wed, 15 July 2020 10:41 AM
గాంధీ ఆస్పత్రిలో కరోనా చికిత్స మొదలైనప్పటి నుంచి పొరపాట్లు
జరుగుతున్న సంగతి తెలిసిందే. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఏకంగా కరోనాతో చనిపోయిన
మృత దేహాల మార్పిడి సైతం జరిగింది. ఒకరి మృత దేహాన్ని మరో కుటుంబానికి అప్పగించడంతో
వారు శ్మశానానికి తీసుకెళ్లి, గుర్తించి మళ్లీ ఆస్పత్రి వచ్చారు.
ఈ క్రమంలో వైద్య
సిబ్బందిపై దాడులు కూడా జరిగాయి. తాజాగా గాంధీలో నిర్లక్ష్యానికి అద్దం పట్టే మరో
ఘటన జరిగింది. ఆస్పత్రిలో కరోనా చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి చనిపోయాడు. అయితే, అతణ్ని
ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం. వ్యక్తి మరణించి 8 గంటలు అవుతున్నా
పట్టించుకునే వారు లేక పోవటంతో మృత దేహం నుంచి దుర్వాసన వచ్చింది.
కరోనా వార్డు మొత్తం చెడు
వాసన వస్తుండడంతో మిగతా రోగులు సైతం ఇబ్బంది పడ్డారు. వాసన విపరీతం రావడంతో
ఐసోలేషన్ వార్డును ఖాళీ చేసి కరోనా పేషెంట్లు అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయారు.
రోగులు వెళ్లి అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా అక్కడి వైద్య సిబ్బంది
పట్టించుకోలేదని సమాచారం. అయితే, ఈ ఘటనపై గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ స్పందించారు.
మార్చురీకి మృత దేహాన్ని తరలించకుండా 8 గంటలపాటు ఉంచారనేది అవాస్తవమని చెప్పారు.
మృత దేహానికి ఈసీజీ తీసేందుకు
కొంచెం సమయం పట్టిందని చెప్పారు. ఈ క్రమంలో దాన్ని తరలించడంలో ఆలస్యం జరిగిందని
వివరణ ఇచ్చారు. సరిపడా సిబ్బంది లేనందున ఈ ఆలస్యం జరిగిందని వివరించారు. ప్రస్తుతం
అందుబాటులో ఉన్న సిబ్బందితోనే 6 ఐసీయూలు, వార్డులు నిర్వహిస్తున్నట్లు సూపరింటెండెంట్ తెలిపారు.