వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను వెంటాడుతోన్న కరోనా...మరో ఎమ్మెల్యేకు కరోనా
By: chandrasekar Mon, 12 Oct 2020 3:06 PM
వైఎస్సార్సీపీలో
ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కరోనా వైరస్ బారినపడ్డారు. కొందరి ఆరోగ్య పరిస్థితి
ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కార్పొరేట్ ఆస్పత్రుల్లో చేరుతున్నారు.
తాజాగా చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కూడా అపోలో ఆస్పత్రిలో
చేరారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయనను ఫోన్లో పరామర్శించారు. ఆరోగ్య
పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వైద్యుల సలహాలను పాటించాలని ఆయనకు సూచించారు.
ఎమ్మెల్యే ఆదిమూలం కరోనా పాజిటివ్ రావడంతో తొలుత తిరుపతిలో ఓ ప్రైవేట్
ఆస్పత్రిలో చికిత్స పొందారు.
శుక్రవారం సాయంత్రం
మెరుగైన చికిత్స కోసం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ఎమ్మెల్యేను డిప్యూటీ
సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు
పరామర్శించారు. ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇటు తిరుపతి
ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరారు. ఆయనకు రెండోసారి
కరోనా పాజిటివ్ రావడంతో ముందస్తు జాగ్రత్తగా అపోలో హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు.
భూమనకు అపోలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి
నిలకడగా ఉన్నట్టు సమాచారం. ఎమ్మెల్యే భూమనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
ఫోన్ చేశారు. ఆయన ఆరోగ్యం పరిస్థితిపై ఆరా తీశారు. వయసు రీత్యా మరిన్ని జాగ్రత్తలు
తీసుకోవాలని పేర్కొన్నారు. భూమన ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని ముందస్తు
జాగ్రత్తగానే అపోలో ఆస్పత్రిలో చేరినట్లు సన్నిహితులు తెలిపారు.