- హోమ్›
- వార్తలు›
- జూన్ లో కరోనా కేసుల సంఖ్య తీవ్ర స్థాయికి చేరే అవకాశం ఉంది ..వైద్య నిపుణులు తన్మయి మహాపాత్ర
జూన్ లో కరోనా కేసుల సంఖ్య తీవ్ర స్థాయికి చేరే అవకాశం ఉంది ..వైద్య నిపుణులు తన్మయి మహాపాత్ర
By: Sankar Mon, 25 May 2020 6:38 PM
భారత్లో కరోనా పరిస్థితి జూన్లో దారుణంగా ఉండనుందని వైద్య నిపుణులు
ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బిహార్లో కేర్ ఇండియా బృందానికి నాయకత్వం
వహిస్తున్న అంటువ్యాధుల నిపుణులు తన్మయ్ మహాపాత్ర.. దేశంలో కేసుల సంఖ్య
పెరగడానికి పరీక్షల సంఖ్య పెరగడం కూడా ఒక కారణం కావొచ్చని
అభిప్రాయపడుతున్నారు. భారత్లోని వివిధ రాష్ట్రాల్లో పరీక్షలు నిర్వహించే
సామర్థ్యం బాగా పెరిగిందని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు కేసులు నమోదు కానీ
ప్రాంతాల్లోనూ పరీక్షలు నిర్వహించాలని, దాని ద్వారా లక్షణాలు కనిపించకుండా
వైరస్ వ్యాప్తి చేసే వారిని గుర్తించవచ్చని ఆయన సూచించారు.
గత వారం
రోజులుగా పెరుగుతున్న కేసుల సంఖ్యకు సడలింపులను కారణంగా చెప్పలేమని.. ఆ
ప్రభావం రానున్న రోజుల్లో తెలుస్తుందని మహాపాత్ర పేర్కొన్నారు. దేశంలో
రెండు నెలల లాక్డౌన్ తర్వాత కూడా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉందని..
ప్రజలు స్వీయ నియంత్రణ చర్యలు పాటించకపోతే వైరస్ మరింతగా వ్యాప్తి చెందే
ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఏప్రిల్,
మే కంటే జూన్లో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండొచ్చన్నారు. జులైలో తారా
స్థాయికి చేరుకొనే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అంతర్జాతీయ అనుభవాలు కూడా
ఇదే అంశాన్ని స్పష్టం చేస్తున్నాయని వివరించారు.
లాక్డౌన్
సడలింపుల తర్వాత ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది.
మార్చి నెలలో ఇరాన్లో కేసుల సంఖ్య భారీగా పెరగడంతో.. వైరస్ కట్టడికి
అక్కడి ప్రభుత్వం అనేక నిబంధనలను విధించింది. తర్వాత ఏప్రిల్లో కేసులు
కాస్త తగ్గడం, కోలుకునే వారి సంఖ్య పెరగడంతో సడలింపుల వైపు మొగ్గు చూపింది.
సడలింపుల అనంతరం ఇప్పుడు అక్కడ రెండో సారి వైరస్ బారిన పడుతున్న వారి
సంఖ్య పెరుగుతోంది.
కరోనా మహమ్మారి ప్రభావంతో విలవిల్లాడిన
స్పెయిన్, బ్రిటన్ దేశాలు స్వల్పంగా నిబంధనలు సడలించాయి. దీంతో అక్కడ
మరోసారి కేసుల సంఖ్య పెరుగుతోంది. దక్షిణ కొరియాలోనూ ఇదే పరిస్థితి. అక్కడ
బార్లు, క్లబ్బులకు అనుమతి ఇచ్చారు. కొన్ని క్లబ్బుల కారణంగా అక్కడ వందల
సంఖ్యలో కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనాను కట్టడి చేశామని చెప్పిన చైనాలోనూ
కొత్త కేసులు నమోదవుతున్నాయి. కరోనా వైరస్కు కేంద్ర స్థానమైన వుహాన్లోనూ
కొత్త కేసులు నమోదవుతున్నాయి.
ఇరాన్, బ్రిటన్, చైనా
తరహాలోనూ భారత్లోనూ కేసుల సంఖ్య పెరగవచ్చని మహాపాత్ర ఆందోళన వ్యక్తం
చేశారు. దేశంలో లాక్డౌన్ సడలింపుల తర్వాత పరిస్థితిని అంచనా వేయడానికి మరి
కొన్ని రోజులు ఆగాల్సిందేనని ఆయన అన్నారు. ‘భారత్ లాంటి పెద్ద దేశాలను
ఎప్పటికీ లాక్డౌన్లో ఉంచలేం. కొన్ని సడలింపులు ఇవ్వడం చాలా అవసరం.
దానర్థం ప్రజలు ఎప్పటిలాగే ప్రయాణాలు చేయొచ్చని కాదు. కరోనా తీవ్రత పరంగా
మనం ఇంకా దారుణ స్థాయికి చేరలేదు. అయితే.. జూన్, జులై నెలల్లో వైరస్
వ్యాప్తి తారా స్థాయికి చేరే ప్రమాదం ఉంది’ అని మహాపాత్ర చెప్పుకొచ్చారు.