Advertisement

  • కరోనాతో కంటి చూపు కోల్పోయిన కేసు దేశ రాజధాని ఢిల్లీలో నమోదు...

కరోనాతో కంటి చూపు కోల్పోయిన కేసు దేశ రాజధాని ఢిల్లీలో నమోదు...

By: chandrasekar Wed, 21 Oct 2020 1:15 PM

కరోనాతో కంటి చూపు కోల్పోయిన కేసు దేశ రాజధాని ఢిల్లీలో నమోదు...


కరోనా మహమ్మారి ఉన్న సమస్యలు చాలడంలేదని కొత్త సమస్యలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ బారినపడిన వారిలో ఊపిరితిత్తులు, గుండె పనితీరుతో పాటు మెదడుపైనా ప్రభావం పడినట్లు చాలా కేసుల్లో గుర్తించారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో కంటి చూపు కోల్పోయిన కేసు నమోదైంది. కరోనా వైరస్ మెదడుపై ప్రభావం చూపడం వల్ల అదనపు సమస్యలు తలెత్తుతున్నట్లు ఎయిమ్స్‌ వైద్యులు అభిప్రాయపడుతున్నారు. కరోనా వైరస్ బారినపడిన పదకొండేళ్ల ఓ బాలిక పాక్షికంగా కంటి చూపు కోల్పోయినట్లు ఎయిమ్స్‌ వైద్యులు పేర్కొన్నారు. మెదడులోని సున్నితపైన నాడీ కణాలపై వైరస్‌ దాడి చేయడం వల్ల ఇలా జరిగిందని పేర్కొన్నారు. దేశంలోనే ఇది తొలి కేసు అయుండొచ్చని వారు తెలిపారు. దీనిపై మరింత లోతుగా అధ్యయనం కొనసాగుతోందని తెలిపారు. తమ బిడ్డకు కరోనా సోకకముందు ఎలాంటి కంటి సమస్యలూ లేవని ఆమె తల్లిదండ్రులు తెలిపారు.

కళ్లు సరిగ్గా కనిపించడం లేదంటూ 11 ఏళ్ల బాలికను ఆమె తల్లిదండ్రులు హాస్పిటల్‌లో చేర్పించారు. MRI స్కాన్‌‌ ద్వారా యాక్యూట్‌ డిమైలినేటింగ్‌ సిండ్రోమ్‌ లక్షణాలు ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. దీని ఆధారంగా కరోనా వైరస్‌ ప్రభావం మెదడుపైనా ఉందని నిర్ధారించారు. సదరు బాలికకు కరోనా సోకినప్పటి నుంచి ఎలాంటి ఆనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నది అనే అంశంపై ప్రత్యేక రిపోర్టు తయారు చేస్తున్నారు. చికిత్స అనంతరం ఆ అమ్మాయికి 50 శాతం చూపు తిరిగి వచ్చిందని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్యం బాగానే ఉందని వెల్లడించారు. ఇమ్యూనోథెరపీ ద్వారా ఆమెకు చికిత్స అందించినట్లు చెప్పారు. బాలికను హాస్పిటల్ నుంచి డిశ్చార్జి చేసినట్లు చెప్పారు. ఏడీఎస్‌ ప్రభావంతో నాడీ కణాల్లోని మెయిలిన్‌ తొడుగు నాశనం అవుతుంది. దీనివల్ల మెదడు పంపించిన సంకేతాలు శరీర భాగాలకు సరిగా చేరక సమస్యలు తలెత్తుతాయని వైద్యులు అంటున్నారు. మరో 13 ఏళ్ల బాలికకు తీవ్ర జ్వరం, మెదడులో వాపు సమస్య ఉందని ఎయిమ్స్ డాక్టర్లు చెప్పారు. ఆమె కూడా కొన్ని రోజుల కిందట కరోనా బారినపడిందని తెలిపారు. ఈ కేసులపైనా ఇంకా పూర్తిగా అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు.

Tags :
|
|

Advertisement