ధైర్యంగా ఉంటే కరోనాను జయించవచ్చు
By: chandrasekar Mon, 07 Sept 2020 09:52 AM
ధైర్యంగా ఉంటే కరోనాను జయించవచ్చని, ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు ప్రజలందరికీ ఈ ధైర్యాన్ని కల్పించాలని పిలుపునిచ్చారు మంత్రి ఈటల రాజేందర్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో ఆదివారం 22 వేల మంది ఆశ వర్కర్లు, 500 మంది ఏఎన్ఎంలతో ఆయన జూమ్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ ఈ ఆరు నెలల అనుభవంలో కరోనాకి చంపే శక్తిలేదని తెలిసిపోయిందన్నారు. 99 శాతం మంది కోలుకొని బయటపడుతున్నారన్నారు. కరోనా ప్రతీ ఇంట్లోకి వచ్చిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు.
ప్రపంచంలో ఎక్కడైనా కరోనాకు చికిత్స ఒక్కటేనన్నారు. అనవసరంగా కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు ఖర్చు చేసుకోవద్దన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ప్లాస్మా థెరపీ చేస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో కరోనా పాజిటివ్ వ్యక్తులను మొదటి రోజే గుర్తించగలిగితే వ్యాప్తిని అరికట్టవచ్చని, ప్రాణాలు కాపాడవచ్చన్నారు. కరోనా వైరస్ రాష్ట్రంలోకి వచ్చిన మొదటి రోజు నుండి హెల్త్ వారియర్స్ కంటి మీద కునుకు లేకుండా పనిచేస్తున్నారని ఆయన ప్రశంసించారు. ప్రజల భాగస్వామ్యంతోనే ఇలాంటి వ్యాధులను ఎదుర్కోగలమని సీఎం కేసీఆర్ పదేపదే చెబుతున్నారని మంత్రి గుర్తుచేశారు.
కరోనా లక్షణాలు, ఇతర సీజనల్ వ్యాధుల లక్షణాలు ఒకే రకంగా ఉండడం వల్ల అనుమానిత లక్షణాలుంటే తొందరగా పరీక్షలు చేయించుకుని నిర్ధారణ చేసుకోవాలని మంత్రి ఈటల సూచించారు. ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలో నెగెటివ్ వచ్చిన వారికి లక్షణాలుంటే తప్పనిసరిగా ఆర్టీ–పీసీఆర్ పరీక్ష చేయించాలన్నారు. తెలంగాణ కరోనాపై పోరులో దేశంలో అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్న రాష్ట్రం అన్నారు. ఇది గర్వ కారణమని, వైద్య సిబ్బంది వల్లనే ఇది సాధ్యమైందన్నారు. కరోనా సమయంలో పనిచేయడం మీ అందరికీ గొప్ప జ్ఞాపకమన్నారు. ‘భరోసా కల్పించండి. ప్రాణాలు కాపాడండి’ అంటూ ఆశ, ఏఎన్ఎంలకు మంత్రి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పలువురు ఆశ, ఏఎన్ఎంలతో ఆయన జూమ్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. వారి సమస్యలన్నీ తీరుస్తామని హామీనిచ్చారు. జీతం పెంచే విషయం సీఎంతో చర్చిస్తామన్నారు. కరోనా తరువాత ప్రతి జిల్లా ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలతో ప్రత్యేకంగా సమావేశమవుతామన్నారు.