నేషనల్ హెరాల్డ్ కేసు... సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మండిపడ్డారు...!
By: Anji Thu, 24 Dec 2020 3:36 PM
ఏళ్లుగా కోర్టులో నలుగుతున్న నేషనల్ హెరాల్డ్ కేసు ముందుకు సాగకుండా బిజేపి ఎంపీ సుబ్రమణ్య స్వామి అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మండిపడ్డారు.
ఈ కేసులో వివిధ పత్రాలను, సాక్షులను ప్రవేశపెట్టాలని కోరుతూ స్వామి దరఖాస్తు చేసినా సాక్షుల జాబితాను జతచేయలేదని విమర్శించారు. గతంలో కోర్టుకు హాజరైన సమయంలోనూ పిటిషన్దారు ఆ వివరాలను సమర్పించలేదని గుర్తు చేశారు.
నిబంధనలకు విరుద్ధంగా ఉన్న దరఖాస్తును కొట్టివేయాలని బుధవారం వారిద్దరూ న్యాయస్థానాన్ని కోరారు.
నేషనల్ హెరాల్డ్ పత్రిక కాంగ్రెస్ పార్టీకి బకాయి ఉన్న రూ.90.25కోట్లను వసూలు చేసుకొనే హక్కును పొందేందుకు యంగ్ ఇండియన్ ప్రై.లి.ద్వారా నేరపూరితమైన కుట్ర పన్నారని సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు.
సోనియా, రాహుల్ సహా ఏడుగురిపై ఢిల్లీ లోని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో స్వామి కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే. కేవలం రూ.50 లక్షల చెల్లింపుతో ఆ హక్కును పొందేందుకు యత్నించారని ఆరోపించారు.
అయితే, ఈ కేసు విచారణను జాప్యం చేసేందుకు సుబ్రమణ్య స్వామి ప్రయతిస్తున్నారని సోనియా, రాహుల్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. కేసు తదుపరి విచారణ జనవరి 12వ తేదీకి వాయిదాపడింది.