ధరణి ఒక ప్రైవేట్ యాప్ .. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
By: Sankar Fri, 09 Oct 2020 4:59 PM
ముందుగా సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్, ఇతర అధికారుల ఆస్తుల వివరాలు ధరణి పోర్టల్ లో నమోదు చేయాలని కాంగ్రెస్ శాసనసభ్యుడు జగ్గారెడ్డి టీఆర్ఎస్ సర్కారుని డిమాండ్ చేశారు.
కేసీఆర్ ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే ఇదిఒక చక్కని మార్గమన్నారు. అయితే, ధరణి ఓ ప్రైవేటు యాప్ అని, దాంట్లో ప్రజల ఆస్తుల వివరాలు నమోదు చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. భవిష్యత్తులో ఈ వివరాలను తాకట్టుపెట్టి భారీ మొత్తంలో రుణాలు తీసుకునే అవకాశం ఉందని అన్నారు. దేశంలో ఎక్కడా లేనిది ధరణి వ్యవస్థ తెలంగాణ ప్రజలకు అవసరమా అని అడిగారు.
పేదవాళ్లు ఏళ్ల తరబడి శ్రమించి కూడబెట్టి ఆస్తులు కొనుగోలు చేస్తే వాటికి ఆధారాలు ఎలా చూపించాలో ప్రభుత్వమే సమధానం చెప్పాలని మండిపడ్డారు. అయినా, ఆస్తుల వివరాలు అడుగుతున్న ప్రభుత్వం, అప్పుల వివరాలు ఎందుకు అడగడంలేదని నిలదీశారు. ప్రైవేటు యాప్ లో ఆస్తులు వివరాలు నమోదు చేస్తుండడంపై ప్రజల్లో అనుమానాలు తలెత్తుతున్నాయని, ముందు ఆ అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. ధరణి యాప్ తీసుకువచ్చేముందు ప్రభుత్వం ప్రజల అభిప్రాయం ఎందుకు తీసుకోలేదన్నారు జగ్గారెడ్డి