చెన్నై ఎయిర్ పోర్ట్ లో కలకలం సృష్టించిన తూటాల బ్యాగ్
By: Sankar Thu, 12 Nov 2020 4:06 PM
చెన్నై జాతీయ విమానాశ్రయంలో బుల్లెట్లు ఉన్న బ్యాగ్ కలకలం సృష్టించింది. కాంగ్రెస్ సీనియర్నేత మయూరా జయకుమార్ వద్ద 17 తూటాలను భద్రతాధికారులు స్వాధీనం చేసుకున్నారు.
బుధవారం ఉదయం కోయంబత్తూరు వెళ్ళడానికి మయూరా జయకుమార్ విమానాశ్రయం చేరుకున్నారు. ఆ సమయంలో ఆయన లగేజీని విమా నాశ్రయ భద్రతాదళ అధికారులు తనిఖీ చేశారు. ఇదే క్రమంలో జయకుమార్ వద్ద ఉన్న మరో బ్యాగులోని వస్తువులను అధికారులు తనిఖీ చేయగా, అందులో 17 తూటాలు లభించడంతో అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
వెంటనే జయకుమార్ ను అదుపులోకి తీసుకున్న భద్రతా సిబ్బంది.. విమానాశ్రయ పోలీసులకు అప్పగించారు. పోలీసులు విచారింగా తనకు తుపాకీ లైసెన్స్ వుందని, తూటాలను భద్రపరచిన సంచిని కోయంబత్తూరు బయల్దేరే సమయంలో తెలియకుండా తీసుకువచ్చానని జయకుమార్ పోలీసులకు వివరణ ఇచ్చారు. విమానాశ్రయ అధికారుల విచారణలో ఆయనకు తుపాకీ లైసెన్స్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో మయూరా జయకుమార్ను పోలీసులు విడిచిపెట్టారు.