సచిన్ పైలట్ కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ హై కమాండ్ ..
By: Sankar Thu, 16 July 2020 2:45 PM
సచిన్ పైలట్ తిరుగుబాటుతో రాజస్తాన్లో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా సచిన్ వర్గంతో చేతులు కలిపిన 19 మంది ఎమ్మెల్యేకు కాంగ్రెస్ పార్టీ ఇదివరకే నోటీసులు జారీచేసింది. పార్టీ శాసనసభాపక్ష సమావేశానికి హాజరుకావడం తీవ్రంగా భావించిన సీఎం.. దానికి గల కారణాలను వెంటనే తమ ముందుంచాలని ఆదేశించారు. మరోవైపు పార్టీలో నెలకొన్న తాజా పరిస్థితులపై పలువురు సీనియర్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సచిన్పై పార్టీ అనుసరిస్తున్న విధానం సరైనది కాదని అభిప్రాయపడుతున్నారు. దీంతో నష్ట నివారణా చర్యలను చేపట్టిన కాంగ్రెస్ అధిష్టానం పైలట్తో సహా ఎమ్మెల్యేలను వెనక్కి తీసుకువచ్చేందుకు పావులు కదుపుతోంది
ఇప్పటికే సోనియా, రాహుల్ గాంధీ పలువురు పార్టీ సీనియర్ల పైలట్ను బుజ్జగించే ప్రయత్నాలు చేసినా అవేవీ సఫలం కాలేదు. ఈ నేపథ్యంలో చివరి ప్రయత్నంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్మి ప్రియాంక గాంధీని అధిష్టానం రంగంలోకి దింపింది. అసమ్మతి కారణంగా పార్టీకి దూరమైన సచిన్ను వెనక్కి తీసుకువచ్చే బాధ్యతను సోనియా ప్రియాంకకు అప్పగించారు.
దీంతో రంగంలోకి దిగిన ఆమె.. కాంగ్రెస్ సీనియర్లు, వ్యూహ రచనలో దిట్టగా పేరొందిన అహ్మద్ పటేల్, కేసీ వేణుగోపాల్లతో మంతనాలు ప్రారంభించారు. వెంటనే పైలట్తో మాట్లాడి ఆయన వెంట ఉన్న ఎమ్మెల్యేలను సైతం వెనక్కి తీసుకొచ్చే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ మేరకు గురువారం వారిద్దరికీ బాధత్యలను అప్పగించారు