ఆ రాష్ట్రంలో మళ్ళీ లాక్ డౌన్ ..జులై 17 నుంచి జులై 31 వరకు
By: Sankar Fri, 17 July 2020 4:48 PM
కరోనా కేసుల తీవ్రతతో రాష్ట్రాలు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి మళ్ళీ లాక్ డౌన్ విధిస్తున్నాయి ..ఇప్పటికే దేశంలో చాల రాష్ట్రాలు కరోనా ప్రభావిత ప్రాంతాలలో లాక్ డౌన్ విధించిగా ..తాజాగా ఒడిశా కూడా అదే బాటలో పయనించింది .. రాష్ర్టంలో కరోనా కేసులు అధికమవుతున్న నేపధ్యంలో ఒడిశా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా ప్రభావిత ప్రాంతాల్లో లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది.
ఈనెల 17నుంచి 31 వరకు లాక్డౌన్ నిబంధనలు అమల్లో ఉంటాయని సర్కార్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఒడిశాలోని గంజామ్, ఖోర్ధా, కటక్, జాజ్పూర్ జిల్లాలతోపాటు రూర్కెలా మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి పూర్తిస్థాయి లాక్డౌన్ నిబంధనలు అమల్లో ఉంటాయని రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అసిత్ త్రిపాఠి తెలిపారు.
ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు సహా అన్ని వ్యాపార దుకాణాలు మూసివేయాలన్నారు. ప్రజలు కూడా వంద శాతం దీనికి సహకరించాలని స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటించాలని కోరారు. నిత్యావసరాలు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1గంటల వరకు అనుమతి ఉందన్నారు. అంతేకాకుండా అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఈ-కామర్స్ సేవలకు సైతం అనుమతి ఉంటుందని ఉత్తర్వులో పేర్కొంది. పూర్తిస్థాయి లాక్డౌన్ ఉండనున్న జిల్లాలో పకడ్భందీగా ఆంక్షలు పాటించేలా ఇప్పటికే ఆయా జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఒడిషా వ్యాప్తంగా కరోనా కేసులు 15,392కు చేరుకుంది. గత 24 గంటల్లోనే 494 కొత్త కరోనా కేసులు నమోదవగా ఇద్దరు మరణించినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.