Advertisement

కలకలం రేపుతున్న ఆడియోలో వ్యాఖ్యలు

By: chandrasekar Mon, 23 Nov 2020 3:54 PM

కలకలం రేపుతున్న ఆడియోలో వ్యాఖ్యలు


గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వేళ బీజేపీ సొంత పార్టీ లోనే అలజడి మొదలైంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తనను మోసం చేశారంటూ ఆ పార్టీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపణలు చేసినట్లుగా వస్తున్న వార్తలు సంచలనంగా మారాయి. తన వర్గానికి చెందిన కార్యకర్తలకు టికెట్ ఇవ్వకుండా బండి సంజయ్ మోసం చేశారంటూ రాజాసింగ్ ఆరోపించినట్లుగా ఓ ఆడియో టేపు బయటకు వచ్చింది. ఆ వ్యవహారంపై రెండు, మూడు రోజుల్లో ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరిస్తూ ఆ ఆడియోలో వ్యాఖ్యలు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్‌కు దగ్గర పడుతున్న వేళ రాజాసింగ్ అంశం బీజేపీకి కొత్త తలనొప్పి తెచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ వ్యవహారం బండి సంజయ్‌తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ సీనియర్ నేత లక్ష్మణ్‌కు ఇబ్బందిగా మారే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు.

గత 2018లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ నుంచి సీనియర్ నేతలందరూ పరాజయం పాలవ్వగా రాజాసింగ్ ఒక్కరే గెలిచారు. అది గోషామహల్ కార్యకర్తల వల్లే సాధ్యమైందని రాజాసింగ్ చెబుతున్నారు. అలాంటి కార్యకర్తల్లో ఒక్కరికి కూడా తాను టికెట్ ఇప్పించుకోలేకపోయానని సదరు ఆడియోలో టేపులో ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా ఉంది. అదే నిజమైతే పార్టీ శ్రేణులకు ఇది ప్రతికూల సంకేతాలు పంపే అవకాశం ఉంది. ఇప్పటికే టికెట్ పంపకాల వ్యవహారంలో ఏర్పడిన ఘర్షణతో బీజేపీ కేంద్ర కార్యాలయంలో కొంత మంది కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. చొక్కాలు చింపుకున్నారు. కొంతమంది వర్గాలకు టిక్కెట్లు కేటాయించలేదని ఘర్షణలు నెలకొంది.

హైదరాబాద్ లో భారీగా కురిసిన వర్షాలవల్ల చాలా నష్టం ఏర్పడింది. ఈ వరదసాయంపై లేఖ వ్యవహారం టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల మధ్య చిచ్చు రాజేసిన సంగతి తెలిసిందే. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌లో వరద బాధితులకు నష్టపరిహారం అందించడాన్ని వెంటనే నిలిపివేయాలని కోరుతూ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారని టీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. మరోవైపు ఆ లేఖ తాను రాయలేదని, తన సంతకాన్ని ఫోర్జరీ చేసి లేఖ పంపించారని బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై చార్మినార్ సమీపంలోని భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం వద్ద నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. లేఖ అంశంపై వాదోపవాదాలు నడుస్తుండగానే రాజాసింగ్ ఆడియో టేపుల వ్యవహారం తెరపైకి వచ్చింది. మరి ఈ ఆడియో టేపులపై ఇటు రాజాసింగ్ గానీ, అటు బీజేపీ పెద్దలు గానీ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. దుబ్బాక ఉపఎన్నికల్లో విజయం ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో గ్రేటర్‌లో బీజేపీ దూకుడు పెంచిన తరుణంలో పార్టీపై ఇది ఏవిధమైన ప్రభావం చూపనుందో వేచి చూడాల్సిందే.

Tags :
|

Advertisement