భారత్, మాల్దీవుల మధ్య కార్గో ఫెర్రీ సేవలు ప్రారంభం
By: chandrasekar Tue, 22 Sept 2020 11:49 AM
భారత్, మాల్దీవుల
మధ్య నేరుగా కార్గో ఫెర్రీ సేవలు ప్రారంభమైయ్యాయి. కేంద్ర షిప్పింగ్ సహాయ మంత్రి
మన్సుఖ్ మాండవియా, మాల్దీవుల రవాణా, పౌర విమానయాన శాఖ మంత్రి ఐషాత్ నహులా సంయుక్తంగా ఇరు
దేశాల మధ్య ప్రత్యక్ష కార్గో ఫెర్రీ సేవలను సోమవారం ఆన్లైన్లో ప్రారంభించారు.
ఈ నేపథ్యంలో 3 వేల
మెట్రిక్ టన్నుల సరుకు రవాణా నౌక టుటికోరిన్ నుంచి కొచ్చికి సోమవారం బయలుదేరింది.
అక్కడి నుంచి ప్రయాణించి ఈ నెల 26న మాల్దీవులలోని కుల్హుదుఫుషి ఓడరేవు, ఈ నెల 29న మాలే
పోర్టుకు చేరుతుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
షిప్పింగ్ కార్పొరేషన్
ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రారంభమైన ప్రత్యక్ష కార్గో నౌక సేవల ద్వారా ప్రతి నెలలో
రెండుసార్లు ఇరు దేశాల మధ్య నేరుగా సరుకు రవాణా జరుగుతుందని తెలిపారు. భారత్, మాల్దీవుల
మధ్య సంబంధాల బలోపేతానికి ఇది ఒక మైలురాయి వంటిదని కేంద్ర షిప్పింగ్ సహాయ మంత్రి
మన్సుఖ్ మాండవియా అన్నారు.