కల్నల్ సంతోష్ కాంస్య విగ్రహాన్ని సూర్యపేట లో ఏర్పాటు...జగదీష్ రెడ్డి
By: chandrasekar Tue, 23 June 2020 11:00 AM
భారత్-చైనా సరిహద్దుల్లో
జరిగిన యుద్ధంలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు కాంస్య విగ్రహాన్ని సూర్యపేట
లో ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి
ప్రకటించారు. సూర్యాపేట పాత బస్ స్టాండ్- కోర్టు జంక్షన్ రహదారికి ఆయన పేరును
పెట్టబోతున్నట్లు ఆయన వెల్లడించారు.
సోమవారం సాయంత్రం రాష్ట్ర
ముఖ్యమంత్రి కేసీఆర్ కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించి ప్రకటించిన
విధంగా గ్రూప్-1 ఉద్యోగపు ఉత్తర్వులు,హైదరాబాద్ లో 711 గజాల
ఇంటి స్థలం, 5 కోట్ల నగదును అందజేశారు. అనంతరం మంత్రి జగదీష్
రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విధంగానే ఉద్యోగపు ఉత్తర్వులు, ఇంటి
స్థలానికి సంబంధించిన జీఓ తోపాటు నగదు మొత్తాన్ని అందజేశారన్నారు. త్యాగధనులకు
తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
అందులో భాగంగానే కల్నల్
సంతోష్ బాబు కుటుంబంతో పాటు యావత్ భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అమరులకు
సైతం ఆర్థిక సహాయం ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఔదార్యాన్ని
చాటుకున్నారన్నారు. బంజారాహిల్స్ లో 711 గజాల ఇంటి స్థలానికి సంబంధించిన దస్తావేజులను
అందజేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగానికి సంబందించి సంతోష్ బాబు సతీమణి సంతోషి
కోరుకున్న శాఖలో ఉద్యోగం ఇచ్చేందుకు హామీయిచ్చారన్నారు.