జడ్పీ జనరల్ బాడీ సమావేశంలో అధికారులను హెచ్చరించిన కలెక్టర్...
By: chandrasekar Wed, 16 Dec 2020 3:52 PM
మంగళవారం జడ్పీ చైర్మన్
బండా నరేందర్రెడ్డి అధ్యక్షతన కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో జిల్లా పరిషత్
జనరల్ బాడీ సమావేశం జరిగింది. జిల్లా పరిషత్తోపాటు మండల సర్వసభ్య సమావేశాలకు
స్థాయికి తగిన అధికారులంతా హాజరు కావాల్సిందేనని లేనిచో మెమో జారీ చేస్తామని
కలెక్టర్ అధికారులకు హెచ్చరిక జారీ చేశారు. అంతకుముందు దేవరకొండ ఎమ్మెల్యే
రవీంద్రకుమార్తోపాటు మూకుమ్మడిగా ఎంపీపీలంతా మండల అధికారులు జనరల్ బాడీ
సమావేశాలకు రాకుండా కింది స్థాయి సిబ్బందిని పంపిస్తున్నారని, ఆర్అండ్బీ
శాఖల వంటి అధికారులు అసలే రావటం లేదని, అధికారులు లేని సభలో మేం ఏం చేయాలని కాసేపు గొడవ
చేశారు. జిల్లా పరిషత్తోపాటు మండల సర్వసభ్య సమావేశాలకు స్థాయికి తగిన అధికారులంతా
హాజరు కావాల్సిందేనని, ఇక నుంచి హాజరుకాని వారికి చార్జి మెమోలు జారీ చేసి
తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో శాసన మండలి
చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కలుగచేసుకొని దీనిపై సీరియస్ యాక్షన్
తీసుకోవాలని సూచించడంతో స్పందించిన కలెక్టర్ చార్జి మెమోలు ఇచ్చి యాక్షన్
తీసుకుంటామని హెచ్చరించారు. అయితే మండల సమావేశాలకు రాని అధికారుల వివరాలను
ఎంపీడీఓలు, జిల్లా జనరల్ బాడీకి రాని వారి వివరాలు జడ్పీ సీఈఓ
విధిగా తనకు పంపించాలని ఆదేశించారు. ఈ నివేదికల ఆధారంగా వారిపై చర్యలు
తీసుకుంటానని తెలిపారు. జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి అధ్యక్షతన సభ ఆరంభం
కాగానే సభ్యులు అధికారుల తీరును ఎండగట్టారు. మునుగోడు మండలం చొల్లేడులో అధికారుల
నిర్లక్ష్యంతో ఓ ఇంటిలో పెద్ద దిక్కును కోల్పోయినప్పటికీ రైతుబీమా డబ్బులు రాలేదని
ఆరోపించారు. స్థానిక సమస్యల విషయంలో అధికారులకు ఫోన్చేస్తే లిఫ్ట్ చేయడం లేదని
ఆరోపించారు.
ప్రభుత్వం ఎన్నో సంక్షేమ
పథకాలు ప్రవేశపెడుతుంటే వాటి అమలులో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ దుయ్యబట్టారు.
మిర్యాలగూడలో ప్రైవేట్ దుకాణాలకు ఎరువులు పంపి సొసైటీలకు ఎందుకు పంపడం లేదని
వ్యవసాయ అధికారులను నిలదీశారు. పీహెచ్సీల్లో వైద్యులు సెలవు పెడితే మరో
వైద్యుడిని డిప్యుటేషన్ చేయాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవటం
లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సమస్యల విషయంలో అధికారులకు ఫోన్చేస్తే
లిఫ్ట్ చేయడం లేదని, చేసినప్పటికీ తమ దృష్టికి రావటం లేదని సభ్యులు
కలెక్టర్ దృష్టికి తీసుకురాగా అధికారులందరూ ఎంపీపీలు, జడ్పీటీసీల
ఫోన్నెంబర్లు ఫీడ్ చేసుకోవాలని, ఫోన్ చేస్తే ఎత్తి సమాధానం ఇవ్వాలని ఆదేశించారు.