ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయం ..అంతర్వేది రథం ఘటన విచారణ సిబిఐ చేతుల్లోకి
By: Sankar Fri, 11 Sept 2020 05:36 AM
అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని రథం అగ్నికి ఆహుతైన ఘటనపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని సీఎం వైఎస్ జగన్ గురువారం నిర్ణయించారు. ఈ ఘటనను సీఎం సీరియస్గా తీసుకున్న విషయం తెలిసిందే. కేసు దర్యాప్తును ఏపీ పోలీసులు సవాలుగా తీసుకున్న తరువాత కూడా కొన్ని రాజకీయ శక్తులు, సంఘాలు మీడియా సమావేశాలు, సామాజిక మాధ్యమాల ద్వారా రాష్ట్రప్రభుత్వంపై లేనిపోని ఆపోహలను ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో.. దోషులు ఎవరైనాసరే కఠినంగా శిక్షించాల్సిందేనన్న నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి విచారణకైనా తాము సిద్ధమేనని ప్రకటించింది. పలు రాజకీయ పార్టీల సంఘాలు సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో పూర్తి పారదర్శకమైన ప్రభుత్వంగా ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. ఈ మేరకు సీబీఐ దర్యాప్తును కోరుతూ కేంద్ర హోంశాఖకు లేఖ రాయాలని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన జీఓ శుక్రవారం వెలువడనుంది.
కాగా రథం దగ్ధం ఘటనపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ప్రభుత్వం మీద విమర్శలు చేసాయి..నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసాయి...జనసేన , బీజేపీ ఆధ్వర్యంలో హిందూ ధర్మ పరిరక్షణ పేరిట నిరసన తెలిపారు..అయితే ప్రతిపక్షాల నిరసనలను దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి తిప్పికొట్టారు..రథం దగ్ధం ఘటనలో ప్రతిపక్షాల పాత్ర మీద అనుమానం ఉంది అన్నారు...