Flash News: హైదరాబాద్ లోనీ వరద బాధితులకు సీఎం రిలీఫ్ కిట్లు....!
By: Anji Sun, 18 Oct 2020 05:37 AM
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు మేయర్ బొంతు రామ్మోహన్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతమహంతి, ఇవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ హాజరయ్యారు.
హైదరాబాద్లో సాధారణ స్థితి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేటీఆర్ తెలిపారు. వరద ప్రాంతాల్లో ప్రతి ఇంటికి సీఎం రిలీఫ్ కిట్ను అందజేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం రిలీఫ్ కిట్లో రూ.2,800 విలువచేసే నిత్యావసరాలు, 3 దుప్పట్లు ఉంటాయని చెప్పారు.
వరదల నేపథ్యంలో నగరంలో ప్రత్యేకంగా శానిటేషన్ డ్రైవ్ నిర్వహించాలని అధికారులకు మంత్రి సూచించారు. యాంటీ లార్వా స్ప్రేయింగ్, సోడియం హైపోక్లోరైట్, క్రిమిసంహారక ద్రావనాలను అన్ని వరద ప్రభావిత ప్రాంతాల్లో పిచికారి చేయించాలని ఆదేశించారు.
ఎంటమాలజీ బృందాల ద్వారా కెమికల్స్ స్ప్రే చేయించాలని సూచించారు. స్పెషల్ శానిటేషన్ డ్రైవ్, స్ప్రేయింగ్కు అవసరమైతే అదనంగా వాహనాలను సమకూర్చుకోవాలని ఆదేశించారు. వరద ప్రాంతాల్లో నిలిచిన నీళ్లను తొలగించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.
వరదలతో నాలాలు, రోడ్లపై పేరుకుపోయిన చెత్త చెదారంతో పాటు బురద, భవన నిర్మాణ వ్యర్థాలు, శిథిలాలను తొలగించుటకు అవసరమైన సిబ్బందిని, అదనపు వాహనాలను వినియోగించాలని తెలిపారు.
అంటు వ్యాధులు ప్రబలకుండా వరద ప్రభావిత ప్రాంతాల్లో మొబైల్ మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలకు ఆరోగ్య సంరక్షణపై నమ్మకం కలిగించాలన్నారు.