Advertisement

  • దుబ్బాకలో ఓటమి భయంతో... నాగార్జునసాగర్‌లో కేసీఆర్ వ్యూహాం ఏమిటో తెలుసా...!

దుబ్బాకలో ఓటమి భయంతో... నాగార్జునసాగర్‌లో కేసీఆర్ వ్యూహాం ఏమిటో తెలుసా...!

By: Anji Thu, 17 Dec 2020 4:20 PM

దుబ్బాకలో ఓటమి భయంతో... నాగార్జునసాగర్‌లో కేసీఆర్ వ్యూహాం ఏమిటో తెలుసా...!

నోముల నర్సింహయ్య అకాల మరణంతో నాగార్జున సాగర్ శాసనసభ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. 2021 మార్చి నెలలో బైపోల్ నిర్వహించే అవకాశం ఉంది.

దుబ్బాక ఉపఎన్నికలో విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్న బీజేపీ.. నాగార్జునసాగర్‌లోనూ పాగా వేసేలా పావులు కదుపుతోంది. ఆ ప్రాంతంలో బీజేపీకి పెద్దగా బలం లేకపోయినప్పటికీ.. కేసీఆర్‌పై వ్యతిరేకతను వాడుకోవాలని భావిస్తోంది.
దుబ్బాకలో ఓటమి.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనూహ్యంగా సీట్లను కోల్పోవడంతో టీఆర్ఎస్ సైతం ఆత్మరక్షణలో పడింది. దుబ్బాకలో దివంగత రామలింగారెడ్డి భార్యకు టికెట్ కేటాయించినప్పటికీ ఫలితం లేకపోయింది.

సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు. దీంతో నాగార్జునసాగర్‌లో కేసీఆర్ వ్యూహాం మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెడ్లకు పట్టున్న ఈ ప్రాంతంలో గత ఎన్నికల్లో నోముల గెలిచినప్పటికీ.. అది కారు హవాలోనే సాధ్యమైంది.

దీంతో ఈసారి నోముల కుటుంబ సభ్యులకు టికెట్ ఇవ్వకుండా.. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతకే గులాబీ పార్టీ టికెట్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ నేత జానారెడ్డి.. ఈసారి పోటీకి దూరంగా ఉంటున్నారు.

దీంతో ఆయన కుమారుడు రఘువీర్ రెడ్డికి టీఆర్ఎస్ గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బీజేపీ సైతం ఆయన్ను తమవైపు లాక్కోవడానికి ప్రయత్నించిందని సమాచారం. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని జానారెడ్డి స్పష్టం చేశారు.

కానీ తన కుమారుడు ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన అడ్డుచెప్పబోరని తెలుస్తోంది. ఒకవేళ రఘువీర్ టీఆర్ఎస్‌లో చేరితే.. ఆయనకే టికెట్ కేటాయించే అవకాశం ఉంది. ఆయన బీజేపీ వైపు మొగ్గు చూపితే మాత్రం.. మరో అభ్యర్థికి కోసం టీఆర్ఎస్ వెతుకులాట సాగించాల్సిందే.

Tags :
|

Advertisement