తెలంగాణ పత్తికి అంతర్జాతీయ డిమాండ్ తీసుకురావాలి ..కెసిఆర్
By: Sankar Tue, 08 Dec 2020 09:49 AM
తెలంగాణలో పండే పత్తి దేశంలో కెల్లా అత్యంత నాణ్యమైనదిగా గుర్తింపు పొందిందని, ప్రపంచంలోకెల్లా అత్యంత నాణ్యమైన పత్తిని ఉత్పత్తి చేసే ప్రాంతాల్లో తెలంగాణ ఒకటని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు వెల్లడించారు.
ఇక్కడి దూది పింజ పొడవు దేశంలో కెల్లా పొడవుగా వస్తోందని, గట్టితనం కూడా ఎక్కువని పేర్కొన్నారు. అత్యంత నాణ్యతతో కూడిన తెలంగాణ పత్తికి అంతర్జాతీయంగా డిమాండ్ కల్పించేందుకు బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ పత్తికున్న విశిష్ట లక్షణాలను గుర్తించి, వాటిని ప్రచారం చేయడానికి అవసరమైన వ్యూహం రూపొందించాలని కోరారు.
దీనికోసం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిపుణులతో చర్చించాలని సూచించారు. తెలంగాణ పత్తికి అంతర్జాతీయంగా మరింత డిమాండ్ రావడానికి అనుగుణంగా పత్తిని శుద్ధి చేయడం, ప్యాక్ చేయడం వంటి పనులను జాగ్రత్తగా నిర్వహించే విషయంలో రైతులకు సూచనలు ఇవ్వాలని చెప్పారు.