ప్రజా కవి కాళోజి జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన కెసిఆర్
By: Sankar Wed, 09 Sept 2020 11:58 AM
ప్రజాకవి కాళోజీ నారాయణరావు 106వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నివాళులర్పించారు. ప్రజల గొంతుకగా జీవితాంతం బతికిన కాళోజీ నారాయణరావు ఎప్పటికీ చిరస్మరణీయుడే అని పేర్కొన్నారు. ప్రజల్లో చైతన్యదీప్తి వెలిగించడానికి ఆయన ధైర్యంగా నిలబడే వారు అని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు.
రవీంద్ర భారతిలో ప్రజా కవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. కాళోజీ చిత్రపటానికి సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పూలమాల వేసి నివాళులర్పించారు.
తెలంగాణ భూమి పుత్రుడు, ప్రజాకవి కాళోజీ జన్మదినం సందర్భంగా మంత్రి ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. తన కవిత్వంతో స్వరాష్ట్ర ఆకాంక్షను రగిలించారని అన్నారు. మన తెలంగాణ భాషను, యాసలోని మాధుర్యాన్ని తన రచనలతో ఎలుగెత్తి చాటారని కొనియాడారు. భాష రెండు విధాలుగా ఉంటుందని, ఒకటి బడి పలుకుల భాష, రెండోది పలుకుబడుల భాష అని.. పలుకుబడుల భాష కావాలని చెప్పిన తెలంగాణ వైతాళికుడు కాళోజీ అని అన్నారు.