పార్టీ నేతలతో నిర్వహించిన భేటీలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు...
By: chandrasekar Thu, 19 Nov 2020 2:40 PM
జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ
టీఆర్ఎస్ భవన్లో పార్టీ నేతలతో నిర్వహించిన భేటీలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
చేశారు. తెలంగాణకు టీఆర్ఎస్ శ్రీరామ రక్ష అన్న కేసీఆర్.. తమ పార్టీ రాష్ట్రం కోసమే
పుట్టి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తోందన్నారు. టీఆర్ఎస్ను దేశంలోనే ఓ రాజకీయ
శక్తిగా కేసీఆర్ అభివర్ణించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ 100కుపైగా
స్థానాలు గెలుస్తుందని తాజా సర్వేల్లోనూ వెల్లడైందన్నారు. రాష్ట్రంలో బోలెడన్ని
అభివృద్ధి పథకాలను తీసుకొచ్చామన్న కేసీఆర్.. మిషన్ భగీరథ అనేది దేశంలో ఎక్కడా
లేదన్నారు. ఇదో అనన్య సామాన్యమైన విషయమని తెలిపారు.
‘‘ఊహించనంత వేగంగా ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్మించాం.
లక్షలాది ఎకరాలకు సాగు నీరు అందిస్తున్నాం. ఏ డంభాచారం కొట్టి.. మేం విడిపోతే మీరు
చెడిపోతారన్న ఆంధ్రప్రదేశ్ను ఎప్పుడో అట్టడుగుకు తోసేశాం. ఏపీలో వరిసాగు 50 లక్షల
ఎకరాల దగ్గరుంటే.. మనం కోటి 3 లక్షల ఎకరాల వరి సాగు దగ్గరకు మనం వెళ్లాం’’ అని
కేసీఆర్ వ్యాఖ్యానించారు. ‘‘ఒక దఫాలో కోటి 32 లక్షల ఎకరాల సాగు చేసే స్థితికి తెలంగాణను
తీసుకొచ్చాం. ఉద్యానవన పంటల సాగు దీనికి అదనం. జఠిలమైన విద్యుత్ సమస్యను త్వరగా
పరిష్కరించాం. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో ప్రారంభించిన బస్తీ దావఖానాలను మన
దగ్గర అంత కంటే మెరుగ్గా ప్రారంభించాం. హైదరాబాద్ సిటీలోనూ అద్భుతాలను ఆవిష్కారం
చేశాం. నగరాభివృద్ధికి రూ.67 వేల కోట్లు ఖర్చుపెట్టాం’’ అని కేసీఆర్
పేర్కొన్నారు.