ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం కెసిఆర్
By: Sankar Sun, 13 Dec 2020 5:51 PM
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే శుభవార్త చెప్పనుంది ...తెలంగాణ వచ్చిన తర్వాత మా కొలువులు మాకు మాత్రమే అని ఎంతో ఆశలు పెట్టుకున్న నిరుద్యోగ యువతకు త్వరలోనే భారీగా కొలువులు సిద్ధం కానున్నాయి..పోలీస్ శాఖ, విద్యా శాఖలో ఖాళీగా పోస్టులను భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆదివారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. సీఎం నిర్ణయంతో దాదాపు 50 వేల ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఉపాధ్యాయ, పోలీసు ఉద్యోగాలతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు సేకరించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ను సీఎం ఆదేశించారు. ‘రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో దాదాపు 50 వేల వరకు ఖాళీలున్నట్లు ప్రాథమిక సమాచారం. వాటన్నంటినీ భర్తి చేయాలి. వేల సంఖ్యలో ఉపాధ్యాయులు, పోలీసుల రిక్రూట్మెంట్ జరగాల్సి ఉంది.
ఈ రెండు విభాగాలతో పాటు రాష్ట్రంలోని ఇతర శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలు వెంటనే సేకరించాలి. ఇంకా ఏఏ శాఖల్లో ఎంత మంది ఉద్యోగుల అవసరం ఉందో లెక్క తేల్చాలి. అలా లెక్క తేలిన తర్వాత వాటిని భర్తీ చేయడం కోసం వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలి’ అని సీఎం కేసీఆర్ ఆదేశించారు.