ఏపీ విద్యార్థులకు విద్యా కానుక కిట్లను అందజేయనున్న సీఎం జగన్
By: chandrasekar Thu, 08 Oct 2020 1:34 PM
ముఖ్యమంత్రి వైఎస్
జగన్మోహన్ రెడ్డి ‘జగనన్న విద్యా కానుక’ కార్యక్రమాన్ని కృష్ణా జిల్లాలోని
పునాదిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అక్టోబరు 8న ప్రారంభించబోతున్నారు.
ఈ మేరకు
రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ
సంచాలకులు వాడ్రేవు చినవీరభద్రుడు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం ఉదయం 10.20
గంటలకు కంకిపాడు మండలం పునాదిపాడుకు చేరుకుని అక్కడి జిల్లా పరిషత్ హై స్కూల్లో
నాడు నేడు పనులను పరిశీలిస్తారు. అనంతరం విద్యార్థులతో ముచ్చిటించిన అనంతరం జగనన్న
విద్యా కానుక కిట్లను అందజేస్తారు. ప్రభుత్వ యాజమాన్యాలకు చెందిన పాఠశాలల్లో
చదువుతున్న ఒక్కో విద్యార్థికి 3 జతల యూనిఫాం, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, పాఠ్య
పుస్తకాలు, 1 నుంచి 5 వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వర్క్ బుక్స్.. 6 నుంచి
10
వతరగతి చదువుతున్న విద్యార్థులకు నోటు పుస్తకాలు, బ్యాగుతో పాటు ‘స్టూడెంట్
కిట్’ గా అందజేయబోతున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తొలిసారిగా ఏపీ
ప్రభుత్వం వర్క్ బుక్స్ కూడా అందజేస్తోంది.
వీటితో పాటు యూనిఫాం
కుట్టుకూలీ డబ్బు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆన్లైన్ ద్వారా తల్లుల
అకౌంట్లో జమ చేయనున్నారు. ప్రత్యేకంగా ఇందు కోసమే ప్రభుత్వం సుమారు రూ. 650 కోట్ల
ఖర్చు చేయబోతోంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని రాష్ట్రంలో 42,34,322 మంది విద్యార్థులకు లబ్ధి పొందనున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో పిల్లల
ఆరోగ్య భద్రతా దృష్ట్యా, ప్రభుత్వ ఆదేశాలు మేరకు భౌతిక దూరం పాటిస్తూ ప్రతి
పాఠశాలలో వరుసగా 3 రోజుల్లో కిట్లు పంపిణీ చేయాలని పాఠశాల విద్యా
సంచాలకుడు సూచించారు. ఇక, గురుకుల పాఠశాలలు, కేజీబీవీల్లో, వసతి గృహాలలో చదువుతున్న విద్యార్థులకు చెందిన కిట్లు
ఇప్పటికే ఆయా పాఠశాలలకు అందాయని పేర్కొన్నారు. విద్యార్థులు ఈలోపు పాఠశాల
ప్రధానోపాధ్యాయుని ద్వారా లేదా, స్వయంగా స్కూల్కి వెళ్లి తీసుకోవాలని తెలిపారు.
‘జగనన్న విద్యా కానుక’ కిట్లో బ్యాగు కానీ, షూ
కానీ, బెల్టు, యూనిఫాం
వంటి వాటిల్లో సరైన సైజు రాకపోయినా, డ్యామేజ్ ఉన్నా, ఆ సమయానికి అందుబాటులో లేకపోయినా ఎవరూ ఆందోళన
చెందవద్దని చినవీరభద్రుడు పేర్కొన్నారు. ఇలాంటి సమస్యలు ఉంటే వెంటనే పాఠశాల
ప్రధానోపాధ్యాయుడిని లేదా మండల విద్యాశాఖాధికారిని సంప్రదించాలని కోరారు. కిట్
తీసుకునేటప్పుడు విద్యార్థి బయోమెట్రిక్, ఐరిష్ హాజరుకు సహకరించాలని కోరారు. ‘జగనన్న
విద్యాకానుక’కు సంబంధించి ఏవైనా సమస్యలు ఎదురైతే 91212 96051, 91212 96052
హెల్ప్ లైన్ నంబర్లను పని దినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటలలోపు సంప్రదించాలని
తెలిపారు.