ఏపీలో కరోనా మృతుల అంత్యక్రియలకు పదిహేనువేలు ..సీఎం జగన్ నిర్ణయం
By: Sankar Tue, 14 July 2020 7:33 PM
కరోనా బాధితులకు ఏ ఆస్పత్రికి కూడా వైద్యం నిరాకరించరాదని, అలా నిరాకరిస్తే కఠినంగా వ్యవహరిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హెచ్చరించారు. కోవిడ్-19 బాధితులకు వైద్యం అందించని ఆస్పత్రుల అనుమతులు రద్దు చేస్తామన్నారు. ఇటువంటి ఆస్పత్రుల పట్ల కఠినంగా వ్యవహరించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
కరోనా మృతుల అంత్యక్రియలకు 15 వేల రూపాయల చొప్పున ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. కోవిడ్ కారణంగా మరణించిన వారికి అంత్యక్రియల విషయంలో ఇటీవల చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెంటనే ఇవ్వాలని అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.
కోవిడ్–19 నివారణ చర్యలపై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై ఈ సమావేశంలో లోతుగా చర్చించారు. రాష్ట్రంలో కోవిడ్–19 పరీక్షలు, కేసుల వివరాలను ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్రెడ్డితో పాటు, ఆ శాఖకు చెందిన పలువురు ముఖ్య అధికారులు సమావేశంలో పాల్గొన్నారు